తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందని ముఖంపై యాసిడ్ పోశాడు!

  • Publish Date - November 26, 2020 / 09:33 PM IST

తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో ప్రియురాలి ముఖంపై యాసిడ్ పోశాడో యువకుడు. ఈ ఘటన పూణెలోని పార్వతిగాన్ ప్రాంతంలో జరిగింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న యువకుడు, చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు ప్రేమించుకున్నారు.



కానీ, ఈ ఏడాదిలో యువతి మరొకరిని పెళ్లి చేసుకుంది. ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదంటూ యువతి ముఖంపై యాసిడ్‌తో దాడి చేశాడు.

ఈ ఘటనలో యువతి ముఖం 7 శాతం వరకు కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. నిందితుడికి బాధితురాలికి చిన్నతనం నుంచే పరిచయం ఉంది.



ఇంటర్ వరకు ఇద్దరూ కలిసే చదువుకున్నారు. పక్కపక్కనే ఇళ్లలో నివసిస్తున్నారు. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ఇంట్లో పెద్దవాళ్లకు తెలిసిన తర్వాత యువతి మరొకరిని పెళ్లి చేసుకుంది. తనను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమెపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు.



నవంబర్ 21న యువతి తన పుట్టింటికి వచ్చింది. ఆ విషయం తెలిసి తనతో మాట్లాడాలని అడిగాడు. స్థానిక పాఠశాలలో ఉదయం 8.30గంటలకు రమ్మన్నాడు. తనకు పెళ్లి అయిందని, తనను మర్చిపోవాలని కోరింది.



అందుకు అతడు ఒప్పుకోలేదు. తనతో రిలేషన్ కొనసాగించాలని పట్టుబట్టాడు. దాని యువతి అంగీకరించలేదు. అంతే.. ఆవేశంతో ఊగిపోయాడు.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌తో యువతి ముఖంపై దాడి చేశాడు.