Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ తెల్లవారుఝామున సిధ్ధార్ధనగర్ లోని జాతీయ రహదారి 28 పై ఆగి ఉన్న లారీని 11 మందితో ప్రయాణిస్తున్న వ్యాన్ బలంగా ఢీ కొట్టింది.
ఘటనా స్ధలంలో 8 మంది మరణించగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను గోరఖ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పెళ్ళికి హాజరై తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఒక్కోక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.