ఎవరైనా లోన్ కావాలంటే ఏం చేస్తారు.. వెళ్లి బ్యాంకు సిబ్బందిని కలుస్తారు, మేనేజర్ తో మాట్లాడతారు. లోన్లు ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తారు. కానీ లోన్ కోసం బాంబుతో బెదిరించడం
ఎవరైనా లోన్ కావాలంటే ఏం చేస్తారు.. వెళ్లి బ్యాంకు సిబ్బందిని కలుస్తారు, మేనేజర్ తో మాట్లాడతారు. లోన్లు ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తారు. కానీ లోన్ కోసం బాంబుతో బెదిరించడం చూశారా, కనీసం విన్నారా. అది కూడా ఓ మహిళ. అవును నిజం… బ్యాంకుని బాంబులతో పేల్చేస్తానని ఓ లేడీ బెదిరించింది. విశాఖపట్నంలో ఈ ఘటన జరిగింది. అనకాపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్(APGV) మేనేజర్ ని ఓ మహిళ భయపెట్టింది. తమ డ్వాక్రా గ్రూపుకి లోన్లు ఇవ్వలేదన్న కారణంతో బ్యాంకుని బాంబులతో పేల్చేస్తానని మేనేజర్ ఫోన్ కి మేసేజ్ లు పంపింది. దీంతో కంగారుపడ్డ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా.. దీనికంతటికి కారణం ఓ డ్వాక్రా గ్రూపు లీడర్ అని తేలింది. దాచేపల్లి వీర శివరంజనిగా గుర్తించారు. విశాఖపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. నగరంలోని స్థానిక గోండా జంక్షన్ లో ఉన్న APGV బ్యాంకు మేనేజర్ కిరణ్ కుమార్ తమకు సకాలంలో లోన్లు ఇవ్వడం లేదనే ఈ పని చేసినట్టు ఆమె అంగీకరించింది. కేవలం బ్యాంకు మేనేజర్ ను బెదిరించాలని మాత్రమే ఈ మెసేజ్ పెట్టినట్టు పోలీసులకు నిజం చెప్పింది. తన కింద 35 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని, ఆ గ్రూపుల సభ్యులకు లోన్లు, ప్రభుత్వ పథకాలు జారీ చేయడంలో బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం వహించినందుకే ఈ పని చేసినట్టు వివరించింది. ఇంత గందరగోళానికి కారణమైన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
పెదగుండాల జంక్షన్ దగ్గర APGV బ్యాంకి ఉంది. దీన్ని పేల్చేస్తానని ఏప్రిల్ 19వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ బ్యాంకు మేనేజర్ సెల్కు మెసేజ్ వచ్చింది. దీంతో కంగారుపడిన ఆయన రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలర్ట్ అయిన పోలీసులు.. మెసేజ్ పంపిన సెల్ నెంబర్, సిగ్నల్ ను ట్రేస్ చేశారు. మండలంలోని తగరంపూడి గ్రామానికి చెందిన ముమ్మిన గోవింద్ అనే వ్యక్తి సెల్ నుంచి మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. గోవింద్ను విచారించగా, వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న తన భార్య సుబ్బలక్ష్మికి ఏప్రిల్ 13న సెల్ఫోన్ ఇచ్చినట్లు చెప్పాడు. ఆమెను విచారించగా ఈ వ్యవహారంతో సంబంధం లేనట్లు గుర్తించారు. మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ కాకుండా, ఆ సిమ్ వేసిన సెల్ IMEI నెంబర్ ఆధారంగా ఆధునిక పద్ధతుల్లో డీకోడ్ చేసి, అసలు నిందితురాలిని గుర్తించారు.
మెసేజ్ వచ్చిన సెల్కు సంబంధించి IMEI నెంబర్ ఆధారంగా సంబంధిత ఫోన్ ఏప్రిల్ 19న స్థానికంగా ఉన్న ఒక సెల్ షాపులోనే కొన్నట్లు పోలీసులు కనుగొన్నారు. సెల్ ఫోన్ కొనుగోలు రశీదు ఆధారంగా సీతానగరం గ్రామానికి చెందిన వీర శివరంజని ఆ ఫోన్ కొన్నట్లు తెలుసుకున్నారు. ఆమెని అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. పాత రుణం తీర్చకుండా కొత్త రుణం ఇవ్వడానికి నిరాకరించాడన్న కోపంతో మనస్తాపానికి గురైన శివరంజని, తన స్నేహితురాలు సుబ్బలక్ష్మి సిమ్ను, తన ఫోన్లో వేసి బ్యాంకు మేనేజర్తోపాటు మరో 16 మందికి ఈ విధంగా మెసేజ్ పెట్టిందని పోలీసులు తెలిపారు.