మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది క్రితం మొదలైన మీటూ ప్రకంపనలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మంచితనం ముసుగులో ఉన్న పెద్దమనుషుల గుట్టురట్టు చేసింది. 20 ఏళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నటుడు నానా పటేకర్ను తనను వేధించాడని, రిహార్సల్స్లో భాగంగా తనను అసభ్యంగా తాకాడని అప్పట్లో తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసింది. ఆ సమయంలో పక్కనే ఉన్న కొరియో గ్రాఫర్ గణేష్ ఆచార్య చూస్తూ ఊరుకున్నాడని తెలిపింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ గణేష్ ఆచార్యపై మీటూ ఆరోపణలు రావటంతో బాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కి పడింది.
అశ్లీల చిత్రాలు చూడమని ఒత్తిడి చేస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై…. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్(33) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కొరియోగ్రాఫర్ మహారాష్ట్ర మహిళా కమిషన్ లోనూ…అంబోలి పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై ఫిర్యాదు చేశారు.
ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ (IFTCA) ప్రధాన కార్యదర్శి అయిన గణేష్ ఆచార్య.. తన సంపాదనలో కమీషన్ ఇవ్వాలని కోరుతున్నాడని… అశ్లీల వీడియోలు చూడమని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆదివారం జనవరి 26న ముంబై లోని అంధేరిలోని తన కార్యాలయానికి పిలిపించిన గణేష్ ఆచార్య మరో ఇద్దరు మహిళలతో కలిసి తనపై దాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కోన్నారు. గణేష్ ఆచార్య ఆంధేరిలోని కార్యాలయానికి తనను తరచూ పిలిచేవాడని… అక్కడకు వెళ్తే ఆయన ఆశ్లీల వీడియోలు చూస్తూ తనను ఆ వీడియోలు చూడమని బలవంతం పెట్టేవాడని పేర్కోంది.
జనవరి 26న ఆచార్య కార్యాలయానికి వెళ్లినప్పుడు తనపై అరుస్తూ…సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారని ఆమె తెలిపింది. ప్రీతి లాడ్, జయశ్రీ కేల్కర్ అనే ఇద్దరితో తనపై దాడి చేయించారని …. అందుకు సీసీటీవీ సాక్ష్యాలు ఉన్నాయని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
IFTCA ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గణేష్ ఆగడాలు మితిమీరాయని బాధితురాలు వాపోయారు. గణేష్ కోరికను తిరస్కరించడంతో, ఆయనకు తన ఆదాయంలో కమీషన్ ఇవ్వకపోవటంతో ఆయన తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. తన ఐఎఫ్టీసీఏ సభ్యత్వాన్ని కూడా గణేష్ తొలగించారని ఆరోపించారు. తనకు అవకాశాలు రాకుండా…పని ఇవ్వోద్దని ఇతర కొరియోగ్రాఫర్లను గణేష్ ఆదేశించినట్లు కూడా ఆమె తన ఫిర్యాదులో వివరించారు.
గతంలో సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కూడా గణేష్ ఆచార్య డ్యాన్సర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. గణేష్ ఆచార్య అల్లుఅర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధమ్ చిత్రంలోని బడిలో గుడిలో సాంగ్ కు కొరియో గ్రాఫర్ గా పని చేశారు. బాలీవుడ్ లో గణేష్ దాదాపు 500 సినిమాలకు కొరియో గ్రాఫర్ గా పని చేసారు.
అక్షయ్ కుమార్ టాయ్లెట్ ఎక్ ప్రేమ్ కథా చిత్రంలో గోరీ తు లత్ మార్ అనే సాంగ్కి కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ ఆచార్య 2018లో బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డ్ పొందారు. సింబా, జీరో, పద్మావత్, సంజు, జుడ్వా2 వంటి చిత్రాలలో పలు సూపర్ హిట్ సాంగ్స్కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు. ఇప్పుడు ఈ ఆరోపణలపై గణేష్ ఎలాస్పందిస్తారో వేచి చూడాలి.