ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఓ కిలాడీ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేసేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 2 వేల 700 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఓ కిలాడీ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేసేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 2 వేల 700 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. ఈ స్థలం విలువ రూ.16 కోట్లకు పైగానే ఉంటుంది. సదరు మహిళ ఆగడాలు శృతి మించడంతో బాధితుల పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితురాలిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని కేసులు పెండింగ్ లో ఉండడంతో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మలక్ పేటకు చెందిన సానియా అజ్జనీ (40) కొన్ని నెలలుగా కొండాపూర్ లోని రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీనగర్ కాలనీ, మాధవహిల్స్ లో అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఖాళీ ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోంది.
రాఘవేంద్ర కాలనీలో 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 495 ఈ లో యజమాని రామకృష్ణ బోరు వేస్తుండగా సానియా రంగప్రవేశం చేసింది. తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తూ ప్లాట్ ను చదును చేసి కంపౌడ్ నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో బాధితుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 738/2018, మరో నాన్ బెయిలబుల్ కేసు క్రైమ్ నెంబర్ 634/2018లో నిందితురాలిని (అక్టోబర్ 11, 2019 పోలీసులు అరెస్టు చేశారు. మరో నాలుగు కేసులు పెండింగ్ లో ఉండటంతో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.
కొండాపూర్ లోని రాజరాజేశ్వరీనగర్ కాలనీ గిరిజ లక్ష్మీకి 400 చదరపు గజాల వస్తీర్ణం కలిగిన ప్లాట్ నెంబర్ 1264, 1265 ఉన్నాయి. వీటికి సానియా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అనుచరులతో బెదిరింపులకు పాల్పడింది. కంపౌడ్ నిర్మించే క్రమంలో మెటీరియల్ తేవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. (క్రైమ్ నెంబర్ 188/2018) ఈ కేసు పెండింగ్ లో ఉండటంతో సానియాకు నోటీసులు జారీ చేశారు.
కొండాపూర్ లోని మాధవహిల్స్ లే అవుట్ లో ప్రవీణ్ కుమార్ కు 799 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నెంబర్ 2, 3 లకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన సానియా కబ్జా చేసేందుకు అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. ప్లాట్ ను చదును చేసి కంపౌడ్ నిర్మించేదుకు యత్నించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు (క్రైమ్ నెంబర్ 604/2018) గతంలోనే నోటీసులు జారీ చేశారు.
రాజరాజేశ్వరీనగర్ కాలనీలో అరుణ్ కుమార్ ఆప్టెకు 900 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నెంబర్ 164, 165, 166 ఉన్నాయి. వాచ్ మెన్ ను సానియా అనుచరులు బెదిరించారు. కంపౌండ్ నిర్మించేందుకు ప్రయత్నించారు. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులకు కేసు (క్రైమ్ నెంబర్ 468/2019) నమోదు చేసి, నోటీసులు జారీ చేశారు.
కొండాపూర్ లోని మాధవహిల్స్ లో ఉపేంద్రనాథ్ కు 400 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ ఉంది. ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశారు. సానియా అనుచరులు తాళం పగులగొట్టి ప్లాట్ ను కబ్జా చేశారు. లోపల షెడ్డు నిర్మాణం చేపట్టారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు క్రైమ్ నెంబర్ (531/2019) కేసు నమోదు చేశారు. ఇది పెండింగ్ లో ఉండటంతో పోలీసులు సానియాకు నోటీసులు ఇచ్చారు.