Young Couple Killed In Road Accident In Srikakulam District
Road Accident : ఎన్ని తప్పించుకున్నా విధి రాతను ఎవ్వరూ తప్పించలేరంటారు పెద్దలు … కోవిడ్ కి చికిత్స పొందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్నినింపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చిట్టి వలసకు చెందిన రౌతు యోగేశ్వరరావు (27) విశాఖపట్నంలో రైల్వేలో కళాసీగా రెండేళ్ల కిందట చేరాడు. ఆర్నెల్ల క్రితం నరసన్నపేటకు చెందిన రోహిణితో (21) వివాహం అయ్యింది.
విశాఖకు రోజు రైలులో వచ్చి ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్లే యోగేశ్వరరావు… రెండు నెలల క్రితమే కంచరపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. భార్య భర్తలు అక్కడ కొత్త కాపురం పెట్టారు. ఇటీవల దంపతులిద్దరికీ కోవిడ్ సోకింది. భార్యాభర్తలిద్దరూ చిట్టివలసలోనే ఉండి, చికిత్స తీసుకుని కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రెండు రోజులక్రితం భార్య గర్భిణీ అని తెలిసింది. భార్యను విశాఖపట్నంలో మంచి డాక్టర్ కు చూపించి కొద్ది రోజులు అక్కడే ఉండి మళ్లీ చిట్టివలస తీసుకువస్తానని తల్లికి చెప్పి భార్యతో కలిసి సోమవారం విశాఖకు బైక్ పై బయలు దేరాడు.
జాతీయ రహదారిపై కనిమెట్ట వద్ద ఫ్లైఓవర్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వీరిని ఢీ కొట్టింది. ఆధాటికి వీరి బైక్ పక్కనే ఉన్నడివైడర్ ను ఢీకొట్టడంతో భార్యభర్తలిద్దరూ కిందపడి అక్కడికక్కడే మరణించారు.
సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్ధలానికి వచ్చారు. విగత జీవులుగా ఉన్న దంపతులను చూసి రోదించారు. పూసపాటి రేగ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సుందర పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.