YouTuber Couple : హర్యానాలోని బహదూర్గఢ్లో అపార్ట్మెంట్లోని ఏడో అంతస్తు నుంచి దూకి ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దేశ రాజధాని న్యూఢిల్లీకి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ జంట గర్విట్ (25), నందిని (22)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. వీరిద్దరూ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు కాగా.. సొంత యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారమ్ల కోసం షార్ట్ ఫిల్మ్లను కూడా చేస్తుంటారు.
కొద్ది రోజుల క్రితం దంపతులు తమ షూటింగ్ బృందంతో కలిసి డెహ్రాడూన్ నుంచి బహదూర్ఘర్కు వెళ్లారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారు తమ ఐదుగురు సహచరులతో కలిసి స్టే చేశారు. ఉదయం 6 గంటల సమయంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. షూట్ సమయంలో ఇద్దరి మధ్య ఏదో సమస్యపై వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఫ్లాట్కు ఆలస్యంగా తిరిగి వచ్చారు. ఇద్దరూ ఏడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ జంట ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్స్ బృందం జంట ఆత్మహత్య పరిస్థితుల సాక్ష్యాలను సేకరిస్తుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కేసు దర్యాప్తు అధికారి జగ్బీర్ తెలిపారు.
Read Also : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 19 లక్షలు పోగొట్టుకున్న మహిళ