Nilkrishna Gajare : అతడో రైతు బిడ్డ.. కృషి పట్టుదలే అతడి ఆయుధం.. అదే అతడ్ని జేఈఈ పరీక్షల్లో టాప్ ర్యాంకు తెచ్చుకునేలా చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం (ఏప్రిల్ 25న) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన 19ఏళ్ల యువకుడు ఆల్ ఇండియా నెంబర్వన్ ర్యాంకు సాధించాడు.
అతడే.. వాషిం జిల్లాలోని బెల్ఖేడ్ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్కృష్ణ గజరే. గత రెండేళ్లుగా పట్టుదల, కృషితో చదివి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్స్లో అద్భుతమైన స్కోరు సాధించాడు. అయితే, జేఈఈ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు నీల్కృష్ణ ప్రతిరోజూ 10 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించాడు. అందుకోసం కఠినమైన షెడ్యూల్ను కూడా ఫాలో అయ్యాడు.
కుమారుడి విజయంపై తండ్రి స్పందన :
నీల్కృష్ణ తండ్రి నిర్మల్ గజరే ఫోన్లో పీటీఐతో మాట్లాడుతూ.. తన కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంలో తనకు మాటలు రావడం లేదని అన్నారు. అకోలాలోని రాజేశ్వర్ కాన్వెంట్లో, వాషిమ్లోని కరంజా లాడ్లోని జేసీ హైస్కూల్లో నీల్కృష్ణ చదివాడు.
ఆ సమయంలో తన అత్త దగ్గర ఉండి చదువుకున్నాడని తండ్రి నిర్మల్ చెప్పారు. తన కుమారుడు ఎప్పటి నుంచో బాగా చదివే విద్యార్థి అని, క్రీడల్లో నిష్ణాతుడని, విలువిద్యలో జిల్లా, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాడని నిర్మల్ గజరే తెలిపారు. షెగావ్లోని శ్రీజ్ఞానేశ్వర్ మస్కుజీ బురుంగలే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో నీల్కృష్ణ చదువుతున్నాడు.
నీల్కృష్ణ ఎలా ప్రిపేర్ అయ్యాడంటే? :
జేఈఈ ఫలితాల్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన నీల్కృష్ణ .. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచేవాడు. 2 గంటలు చదువుకునేవాడు. ఆ తర్వాత ప్రాణాయామం చేసి మళ్లీ ఉదయం 8.30 నుంచి చదువుకునేవాడు. రాత్రి 10 గంటలకు నిద్రపోయేవాడని తండ్రి గజరే చెప్పుకొచ్చారు. ‘నా కుమారుడు చదువులోనూ జీవితంలోనూ బాగా రాణించాలని నేను కోరుకున్నాను.
అందుకే అతన్ని బాగా చదువుకోవాలని ప్రేరేపించాను. నేను ఎప్పటికీ సాధించలేని వాటిని నీల్కృష్ణ సాధించాలని నేను కోరుకుంటున్నాను” అని తన కొడుకు విజయం గురించి తండ్రి గజరే చెప్పారు. ఐఐటీ బాంబేలో నీల్కృష్ణ చదువుకోవాలని, సైంటిస్ట్గా ఎదిగేందుకు తాను కృషి చేస్తానన్నారు. తన కలను సాధించుకోవడానికి ఒక అడ్డంకిని అధిగమించిన నీల్కృష్ణ.. షెగావ్లో వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్డ్కు సిద్ధమవుతున్నాడు.