Karnataka Polls: షెట్టర్ కష్టమే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం మళ్లీ ఓడిపోతారట?
కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
- tony bekkal
- Published On : May 11, 2023 / 05:25 PM IST
Jagadish Shettar
Karnataka Polls: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత జేపీ నడ్డా సహా.. ముఖ్య నేతలను కలిసి వచ్చారు. అయినప్పటికీ అధిష్టానం మొండిచేయి చూపించడంతో కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
హుబ్లీ దర్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయే అవాకాశాలు కనిపిస్తున్నట్లు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో జగదీష్ షెట్టర్ ఓటమి ఖాయమని పలు సర్వేలు వెల్లడించాయి. ఎన్నికలకు ముందు షెట్టర్ పార్టీ మారడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ప్రభావం ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉంటుందని, బీజేపీకి ఇది చేటు చేస్తుందని ప్రచారం సైతం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓడతారని సర్వేలు చెప్పడం గమనార్హం.
