Gujarat Polls: బీజేపీ-బీ టీం అంటూ విమర్శలు.. తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదన్న ఓవైసీ
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్న రాజకీయాలు పూర్తిగా తప్పుడువి. ఇక్కడ లవ్ జిహాద్ అనేదే లేదు. కానీ, బీజేపీ దాన్ని ఎగదోస్తోంది. మహిళలపై దాడులు, మైనారిటీ వర్గాపై దాడులు, నిమ్న వర్గాలపై దాడులు చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ బీజేపీ పాలన ఫలితమే. మేం వీటిని పూర్తిగా ఖండిస్తున్నాం’’ అని అన్నారు.
- tony bekkal
- Published On : November 24, 2022 / 06:05 PM IST
We do not need permission says Asaduddin Owaisi
Gujarat Polls: మజ్లిస్ పార్టీకి ఎన్నికల్లో ఒక చేదు అనుభవం ఎదురవుతోంది. ఎక్కడ పోటీ చేసినా బీజేపీ-బీ టీం అంటూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు మజ్లిస్ నేతలు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కూడా అలాంటి వ్యాఖ్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ విమర్శలు ఆగడం లేదు. సరికదా మరీ ఎక్కువయ్యాయి. కాగా, ఈ విమర్శలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు ఎవరి నుంచీ అనుమతి అక్కర్లేదని తేల్చి చెప్పారు.
‘‘ఎన్నికల్లో పోటీ చేయడమనేది మా హక్కు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అందుకు మాకు ఏ రాజకీయ పార్టీ నుంచి అనుమతి అక్కర్లేదు. మాకు ప్రజలపై నమ్మకం ఉంది. రాజ్యాంగంపై నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికే మేము పోటీ చేస్తున్నాము. మా పోరాటం కూడా అదే’’ అని ఓవైసీ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్న రాజకీయాలు పూర్తిగా తప్పుడువి. ఇక్కడ లవ్ జిహాద్ అనేదే లేదు. కానీ, బీజేపీ దాన్ని ఎగదోస్తోంది. మహిళలపై దాడులు, మైనారిటీ వర్గాపై దాడులు, నిమ్న వర్గాలపై దాడులు చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ బీజేపీ పాలన ఫలితమే. మేం వీటిని పూర్తిగా ఖండిస్తున్నాం’’ అని అన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాస్తవానికి 14 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపినప్పటికీ, ఒక అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీ 13 అభ్యర్థులకు తగ్గింది. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1న మొదటి విడత, డిసెంబర్ 5న రెండవ విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న విడుదల కానున్నాయి.
Maharashtra: మహా గవర్నర్ అన్ని హద్దుల్ని దాటారు.. కోశ్యారిపై శరద్ పవార్ ఫైర్
