Hyderabad Hospital : హైదరాబాద్ వైద్యుల అరుదైన ఘనత.. 60ఏళ్ల వ్యక్తి కిడ్నీలో 418 రాళ్లను తొలగించారు..!

Hyderabad Hospital : హైదరాబాద్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. కేవలం 27శాతం కిడ్నీ పనితీరు కలిగిన వ్యక్తి కిడ్నీలో నుంచి 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు.

Hyderabad Hospital : అతడికి 60ఏళ్లు ఉంటాయి.. కొద్దిరోజులగా విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అప్పటికే అతడి మూత్రపిండాల పనితీరు తీవ్రంగా బలహీనపడింది. కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అతడికి తరచూ నొప్పి వస్తుండటంతో భరించలేక హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లోని వైద్యులు సంప్రదించాడు.

Read Also : Elon Musk AI : 2029 నాటికి మనుషుల కన్నా ఏఐ చాలా తెలివైనదిగా మారుతుంది : ఎలన్ మస్క్!

అతడి కిడ్నీ పనితీరును పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అధిక సంఖ్యలో కిడ్నీలో రాళ్లు చేరినట్టు నిర్ధారించిన వైద్యులు అతడికి ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న వైద్యులు.. అత్యాధునికమైన ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి రోగి కిడ్నీలో నుంచి రాళ్లను బయటకు తీశారు. ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు.

డాక్టర్ కె. పూర్ణ చంద్ర రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ దినేష్ ఎం నేతృత్వంలోని యూరాలజిస్ట్‌ల బృందం ఆధునాతన శస్త్రచికిత్సా పద్ధతిలో ఈ ఆపరేషన్ పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది. ఇన్వాసివ్ విధానం ద్వారా దాదాపు 2 గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్టు వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స ద్వారా ఎక్కువ సంఖ్యలో రాళ్లు తొలగించడం వైద్య విధానంలోనే గణనీయమైన పురోగతిగా వైద్యులు పేర్కొన్నారు.

సూక్ష్మ కెమెరాతో పాటు లేజర్ ప్రోబ్స్‌, ప్రత్యేక పరికరాలను ఉపయోగించి ఎలాంటి సర్జికల్ ఓపెనింగ్స్ లేకుండానే కిడ్నీలో రాళ్లను తొలగించినట్టు చెప్పారు. పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ (PCNL) ద్వారా తక్కువ హానికరమైన పద్ధతిలో ఆపరేషన్ చేసినట్టు వైద్యబృందం తెలిపింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యబృందం వెల్లడించింది.

Read Also : Asia Best Restaurants List : 2024లో ఆసియాలోని టాప్ 100 రెస్టారెంట్ల జాబితా.. 5 భారతీయ రెస్టారెంట్లకు చోటు!

ట్రెండింగ్ వార్తలు