తెలంగాణలో 25 కరోనా హాట్‌స్పాట్‌లు, 600కి పెరగనున్న పాజిటివ్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా

  • Publish Date - April 5, 2020 / 02:23 AM IST

ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా

ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువమందికి కరోనా నిర్ధరణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మర్కజ్ సదస్సే అని అధికారులు చెబుతున్నారు. సుమారు వెయ్యి మంది తెలంగాణ వాసులు ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారందరిని గుర్తించిన ప్రభుత్వం, తక్షణమే వారికి వైద్య సేవలు అందిస్తోంది.

రాష్ట్రంలో కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన 25 ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ హాట్‌ స్పాట్లుగా గుర్తించింది. వీటిలో 
* హైదరాబాద్‌లోని పాతబస్తీ 
* వరంగల్‌ అర్బన్
* నిజామాబాద్‌ పట్టణం
* కరీంనగర్‌ పట్టణం తదితర ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా హాట్‌ స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా:
వీటి వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించ లేదు. అయితే ఇప్పటివరకు గుర్తించిన హాట్‌ స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారికి, వారి సన్నిహితులకు ఏప్రిల్ 10వ తేదీ నాటికి పరీక్షలు పూర్తి కానుండటంతో వీటి సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కరోనా కేసులు పెద్దగా నమోదయ్యే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. 

హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు:
హాట్‌ స్పాట్ల పరిధిలో వైరస్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు తరలిస్తారు. ఈ కార్యక్రమం చివరి పేషంట్‌ దొరికే వరకు కొనసాగుతుంది. హాట్‌ స్పాట్ల పరిధి ఎంత మేరకు ఉంటుంది, వాటిని పాజిటివ్‌ కేసులున్న పరిధిలో ఎంత దూరం వరకు మ్యాపింగ్‌ చేస్తారన్న దానిపై కేంద్రం మార్గదర్శకాలను ఇస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ఏప్రిల్ 10వ తేదీ నాటికి 600 కరోనా కేసులు:
ఏప్రిల్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలో 600కు పైగా కరోనా కేసులు నమోదు కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి, వారి  కుటుంబీకులకు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి 10వ తేదీ లోపు పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం  ఉందనేది సర్కారు అంచనా. ఇప్పటివరకు 21 జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌  జిల్లాల్లోనే ఉన్నాయి.