నకిలీ ఐడీ కార్డుల కేసులో రవిప్రకాష్ కు 14 రోజుల రిమాండ్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డు తయారీ కేసులో రవి ప్రకాశ్‌పై కేసు పెట్టారు.

  • Publish Date - October 17, 2019 / 08:21 AM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డు తయారీ కేసులో రవి ప్రకాశ్‌పై కేసు పెట్టారు.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్‌ పేరుతో నటరాజన్‌ అనే వ్యక్తి పేరు మీద ఫేక్‌ ఐడీ కార్డు క్రియేట్‌ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు 406/66 ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్‌ను పీటీ వారెంట్‌ ద్వారా అక్టోబర్ 17వ తేదీ గురువారం మియాపూర్‌ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం రవి ప్రకాశ్‌ను చంచల్‌గుడా జైలుకు తరలించారు. 

ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నిధుల మళ్లింపు వ్యవహారంలో శనివారం (అక్టోబర్5, 2019) ABCL బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా 18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. న్యాయస్థానం రవి ప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

రవిప్రకాశ్, మూర్తి ఇద్దరూ చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేసినట్లుగా తేలింది. బోనస్‌, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లుగా కొత్త యాజమాన్యం గుర్తించింది. రికార్డుల తనిఖీల సమయంలో.. రవిప్రకాశ్ దోపిడీ బయటపడింది.  రవిప్రకాశ్, మూర్తిపై సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. టీవీ9 నిధులను బోర్డు సభ్యులకు తెలియకుండా మళ్లించటంపై ప్రశ్నించారు. రూ.18 కోట్ల రూపాయల వరకు అక్రమంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆధారాలతో సహా కంప్లయింట్ చేసింది టీవీ9 యాజమాన్యం. అనంతరం ఈ విషయంపై పోలీసులు అరెస్ట్ చేశారు.

చెక్ పవర్ దుర్వినియోగం చేసినట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త యాజమాన్యం రికార్డులు తనిఖీలు చేస్తుండగా ఈ మోసం వెలుగు చూసింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు అనుమతి లేకుండా నిధులు డ్రా చేసినట్లు కొత్త యాజమాన్యం గుర్తించింది. క్లి ఫోర్డ్ పెరీరాకు అక్రమంగా…రూ. 5.97 కోట్ల బోనస్‌ను రవి ప్రకాశ్ జారీ చేసినట్లు తెలిసింది. 2017-18, 2018-19లో ఏబీసీఎల్‌కు వచ్చిన లాభాలకు సరిపడా నిధులను అక్రమంగా రవిప్రకాశ్‌, మూర్తిలు తీసుకున్నారని, సెప్టెంబర్‌ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య మూడు సార్లు బోనస్‌ల పేరిట డబ్బు డ్రా చేసినట్లు తనిఖీల్లో బయటపడింది. 

2018 ఆగస్టులో ఏబీసీఎల్‌లో 90.54 శాతం షేర్లను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. ఏబీసీఎల్‌ యాజమాన్య హక్కులు పూర్తిగా అలంద మీడియావే. అలంద మీడియా అనుమతి లేకుండా రవిప్రకాశ్‌, మూర్తిలు అక్రమంగా బోనస్‌ తీసుకున్నట్లు, బోనస్‌గా ఇచ్చినట్లు రికార్డుల్లో రాయమంటూ రవిప్రకాశ్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.