తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీఎస్ పదవికి అర్హులపైన సీనియర్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన ఎస్కే జోషి.. ఈనెలాఖరుకు రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న కొందరి పేర్లపై దృష్టి పెట్టారు. ఇలాంటి వారిలో కొందరు రాష్ట్ర సర్వీస్లో ఉంటే.. మరికొందరు కేంద్ర సర్వీస్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికార్లలో ఒకరిని సీఎస్గా నియమించే అవకాశం ఉంది.
కొత్త సీఎస్ నియామకంపై అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్లు అజయ్ మిశ్రా, సోమేశ్కుమార్, రాజేశ్వర్తివారీ, శాంతికుమారి, చిత్రా రామచంద్రన్లకు సీఎస్ అర్హత ఉంది. అలాగే అధర్ సిన్హా , రాజీవ్రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, షాలినీ మిశ్రా, బీపీ ఆచార్యలకు కూడా అర్హులే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్కి సన్నిహితంగా మెలిగే అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎస్ రేసులో అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్ మధ్య ప్రధాన పోటీ ఉందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
కానీ అజయ్ మిశ్రాకు ఆరు నెలల సర్వీస్ మాత్రమే ఉంది. సోమేశ్కుమార్కు ఇంకా మూడు సంవత్సరాల సర్వీస్ ఉంది. సోమేశ్కుమార్ కంటే అజయ్ మిశ్రా సీనియర్. ఆరు నెలల్లో రిటైరయ్యే అజయ్ మిశ్రా కంటే.. మూడేళ్ల సర్వీస్ మిగిలివున్న సోమేశ్కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద కొత్త సీఎస్ నియామకంపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే చాన్స్ ఉంది.