కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. కేటీఆర్ ఫామ్హౌస్ దగ్గరకు వెళ్లి హడావుడి చేసి.. అందరి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించారు. మరోవైపు.. గోపన్పల్లి భూదందా వ్యవహారంలో రేవంత్కు వ్యతిరేకంగా అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించారు.
కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర హడావుడి:
కోట్లాది రూపాయల విలువైన భూములను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి… దానిపై ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. పైగా.. ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. గండిపేటలో ఉన్న మంత్రి కేటీఆర్ ఫామ్హౌస్ దగ్గరకు వెళ్లి హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపైనా విరుచుకుపడ్డారు. కేటీఆర్పైనా ఆరోపణలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రేవంత్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ను ఉపయోగించినందుకు రేవంత్ అనుచరుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
కేటీఆర్ లీజుకి తీసుకున్నారు:
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. గోపన్పల్లిలో భూదందా ఆరోపణలపై స్పందించకుండా.. బట్టకాల్చి కేటీఆర్ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్పై మండిపడ్డారు. రేవంత్ ఆరోపిస్తున్న భూముల గురించి కేటీఆర్ 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలోనే పేర్కొన్నారన్నారు. ఫామ్హౌస్ కేటీఆర్ లీజుకు తీసుకున్నారని స్పష్టం చేశారు. రేవంత్ అక్రమాలన్నింటినీ విప్పుతామంటూ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూఅక్రమాలు:
రేవంత్రెడ్డి భూఅక్రమాల వ్యవహారం ఇప్పటికే తెలంగాణలో ప్రకంపనలు పుట్టించింది. గోపన్పల్లిలో వందల కోట్ల విలువైన భూములను రేవంత్ సోదరులు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేటు వ్యక్తుల భూములతోపాటు, ప్రభుత్వ భూములను సైతం కొల్లగొట్టేందుకు చేసిన కుట్రలు అధికారుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. రాజకీయ అండదండలతో ప్రభుత్వ, ప్రైవేట్ భూములనూ ఆక్రమించుకున్న సోదరులిద్దరూ.. చెరువులు, కుంటలతో పాటు రోడ్లునూ కబ్జా చేసినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. రేవంత్ బ్రదర్స్ అక్రమాలపై మరింత లోతుగా విచారించేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించే ఛాన్స్ ఉంది.
గోపన్ పల్లిలో భూకబ్జా:
శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో సర్వే నెంబర్ 34లో ఎకరా 11 గుంటల భూమిని కబ్జా చేసినట్టు గుర్తించామంటున్నారు అధికారులు. సర్వే నెంబర్ 126 కోమటికుంట చెరువులో ఎకరా 14 గుంటలను కబ్జా చేసినట్లు గుర్తించారు. వందేళ్ల నుంచి ఉన్న గోపన్పల్లి రోడ్డుతో పాటు, సర్వే నెంబర్ 127లో బండ్లబాటనూ రేవంత్ ఆక్రమించారంటున్నారు స్థానికులు. సర్వే నెం 128, 160ల్లోనూ 10 గుంటల ప్రయివేట్ స్థలాన్ని కబ్జా చేసి గేట్లు ఏర్పాటు చేశారన్నారు. సర్వే నెంబర్ 127లోనూ ఐదెకరాల 21 గుంటల టైటిల్ ఫేక్ అని అధికారులు నిర్ధారించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ యాక్ట్ ప్రకారం అన్ని రకాల నిబంధనలను రేవంత్రెడ్డి ఉల్లంఘించారని అధికారులు చెప్తున్నారు. రేవంత్ బ్రదర్స్ పై క్రిమినల్ చర్యలు తప్పవంటున్నారు. మొత్తానికి దొంగే దొంగ అన్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఫైరవుతున్నారు. ప్రైవేట్ ఫామ్ హౌస్ను కేటీఆర్కు అంటగట్టే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యారని విమర్శించారు.