సహకార బ్యాంకు చైర్మన్‌ పదవులపై కన్నేసిన నేతలు : అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు

తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో.... జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది.

  • Publish Date - February 29, 2020 / 03:21 AM IST

తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో…. జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది.

తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో…. జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది. ఈ చర్చకు నేటితో తెరపడనుంది. మరికొద్ది గంటల్లో అదృష్టం ఎవరిని వరించనుందో  తేలిపోనుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధిష్టానం డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల  అభ్యర్థుల జాబితాను ఆయా జిల్లాల మంత్రులకు సీల్డ్‌ కవర్‌లో పంపింది.

90శాతానికి పైగా స్థానాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు  
ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే 90శాతానికిపైగా స్థానాలు దక్కించుకున్నారు. దీంతో వారంతా జిల్లా చైర్మన్‌ పదవులపై కన్నేశారు. జిల్లా చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు నేతలు ఎవరికి వారే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక ఇవాళ జరుగనుంది. 

చైర్మన్‌ పదవులపై ఆశలు పెంచుకున్న నేతలు
జిల్లాల వారిగా డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్ పదవులపై  అధికార పార్టీ నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు. కొన్ని జిల్లాకు సంబంధించి ఇప్పటికే చైర్మన్ అభ్యర్థులకు పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 9 జిల్లాల్లో సామాజిక సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానం చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో నాగభూషణం, బ్రహ్మయ్యల్లో ఒకరికి డిసిసిబి చైర్మన్ పదవి దక్కనుంది. వరంగల్‌లో ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన మార్నేని రవీందర్ రేస్‌లో ఉన్నారు. ఇక నల్లగొండలో పల్లా ప్రవీణ్ రెడ్డి పేరు బలంగా  వినిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా బయ్యాని మనోహర్ రెడ్డికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

పాలమూరు జిల్లాలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ 
పాలమూరు జిల్లాలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీఉన్నా… మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వైపు  కేసిఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మెదక్ జిల్లాలో దేవేందర్ రెడ్డికి చైర్మన్‌గిరి దక్కే అవకాశం కనిపిస్తోంది. కరీనంగర్‌లో  రవీందర్‌రావుకే మరోసారి అవకాశం దక్కింది.  కి ఆదిలాబాద్‌లో గోవర్ధన్ రెడ్డి, బొజారెడ్డి, రఘునందన్‌రెడ్డి  డీసీసీబీ చైర్మన్‌ రేస్‌లో ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డికి  అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. 

డీసీఎంస్‌ చైర్మన్లకూ నేతల మధ్య పోటీ
జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదవి  తర్వాత అదే స్థాయిలో ఉండే జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపైనా గులాబీ నేతలు భారీగా ఆశలుపెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో భర్తీ చేసే ఈ పదవులపై నేటితో సస్పెన్స్ వీడనుంది. ఇప్పటికే డైరెక్టర్  ఎన్నిక పూర్తి కావడంతో ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నేడు నిర్వహించనున్నారు. 

నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎంపిక 
ఇవాళ జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎంపికపై టీఆర్‌ఎస్‌ కసరత్తు పూర్తి చేసింది. అన్నిచోట్ల సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంది. అయితే అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించలేదు. ఇవాళ చైర్మన్‌ ఎన్నిక సమయానికి సంబంధిత మంత్రులకు అధిష్టానం నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల అభ్యర్థుల జాబితా సీల్డ్‌ కవర్లో అందనుంది. ఆ జాబితా ప్రకారం చైర్మన్లను ఎంపిక చేయనున్నారు.

 

See Also | పీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు..!