హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ కి సమయం దగ్గర పడుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదలకు ముందే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఈసి రజత్ కుమార్ బుధవారం సమావేశమయ్యారు.
ఆయా పార్టీల అభిప్రాయాలు, వారి సలహాలు,సూచనలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా చేస్తున్న ఏర్పాట్లును వివరించారు. గతంలో మాదిరిగానే ECIL అండ్ BEL తయారు చేసిన ఈవిఎంలనే వాడుతున్నట్లు చెప్పారు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ లిస్టును సంసిద్దం చేస్తున్నామని, ఓటర్ లిస్ట్ ను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని రాజకీయ పార్టీలు అడిగిన ప్రశ్నలకు రజత్ కుమార్ సమాధానం చెప్పారు. మరో వైపు అటు రాజకీయ పార్టీలు, రెండు రాష్ట్రాల ఓటర్ల లిస్ట్ ను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని దొంగ ఓట్లను తొలగించాలని సూచించారు. మరీ ముఖ్యంగా హైద్రబాద్ వంటి నగరంలో ఓట్లు తగ్గడానికి గల కారణాలను పరిశీలించాలని సీపిఎం నేతలు కోరారు. మరో వైపు ఎన్నికల్లో ధనప్రవాహం జరగకుండా అడ్డుకట్ట వేయాలని సూచించినట్లు తెలిపారు.
ఏపీలో ఓటర్ లిస్ట్ పై జరుగుతున్న గందరగోళం దృష్ట్యా తెలంగాణలో ఓటర్ల పేర్లు నమోదు, తొలగింపును జాగ్రత్తగా చేయాలని ఈసీకి సూచించారు కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్.గత ఆసెంబ్లీ ఏన్నికల్లో చాలా ఈవీఎంలు పనిచేయలేదు. ఎంపీ ఏన్నికల్లో అలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. నామినేషన్ వేసే వ్యక్తి ఫాం 26 ప్రకారం వారి విదేశీ ఆస్తులు వెల్లడించాలని ఈసీ చెప్పిందని తెలిపారు. ఇక గత అసెంభ్లీ సమయంలో ధరఖాస్తు చేసుకున్న 17 లక్షల మంది ఓటర్లకు ఈపార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాని టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. అయితే రాజకీయ పార్టీలు లెవనెత్తిన అంశాల పై కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించి..షెడ్యుల్ విడుదల తర్వాత మరో సారి భేటి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.