హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజుల పాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై వేగాన్ని నియంత్రించేందుకు జీహెచ్ ఎంసీ చర్యలు చేపట్టనుంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సిటీ ప్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. ఆమె కూతురు ప్రణీతతోపాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. సీపీ సజ్జనార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత నెల 10వ తేదీన ఇదే ప్లైఓవర్ పైనుంచి బైక్ కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమా, లేదా వేరే కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఫ్లైవోవర్ పై ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో అధ్యయనం చేసి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓవర్ స్పీడ్, డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. 40 స్పీడ్ వెళ్లాల్సిన కారు..90 నుంచి 100 స్పీడ్ వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరు కూడా ఫ్లైవోవర్ పై నిల్చొవద్దని, అతి వేగంతో వెళ్లొద్దన్నారు.