హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్లోని రోడ్లపై ఆర్మీ అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌరుల రాకపోకలను నిషేధించారు. రాత్రి 10 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 7 గంటల వరకు సాధారణ ప్రజలు రాకపోకలు సాగించకుండా మిలటరీ అథికారులు ఏవోసీ రోడ్లు మూసివేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్ళాలని సూచిస్తూ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్లో ఉన్న రక్షణ శాఖ పరిధిలోని అర్మీ అర్డీనెన్స్ కార్ఫ్(ఏవోసీ) లోని రోడ్లపై రాత్రిపూట సాధారణ ప్రజానీకం రాకపోకలను నిషేధించారు. అధికారులు అంతర్గత రోడ్లను మూసివేయడంతో ఆ రోడ్లతో లింక్ ఉన్న రామకృష్ణాపురం,మల్కాజిగిరి, సఫిల్గూడ, న్యూ గాంధీనగర్, శక్తినగర్, తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రాకపోకలు తెగిపోనున్నాయి. ఇప్పటికే లోకల్ మిలటరీ అధికారులు గేట్లు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు ముందస్తుగానే సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలియజేశారు.