తెలంగాణకు దేవుడిచ్చిన బహుమతి, గాంధీ తర్వాత అంత గొప్ప నాయకుడు కేసీఆర్

  • Publish Date - February 16, 2020 / 09:28 AM IST

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, అంధులకు బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై హోంమంత్రి మహమూద్ అలీ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణకు దేవుడిచ్చిన బహుమతి సీఎం కేసీఆర్ అని మహమూద్ అలీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత అంత గొప్ప నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చారు. దేశంలో సెక్యులర్ లీడర్ ఎవరైనా ఉంటే అది కేసీఆరే అన్నారు. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పారు.

ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ 66వ జన్మదినం జరుపుకోనున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. కేసీఆర్ అభిమానులు.. బర్త్ డే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు వేడుకలకు రెడీ అవుతున్నారు. కొందరు కేక్ లు రెడీ చేశారు. మరికొందరు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఇంకొందరు దానాలు చేయడానికి రెడీ అవుతున్నారు. 

కేసీఆర్ పుట్టిన రోజు సంధర్బంగా సిద్ధిపేట జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా మొక్కలు నాటాలని లక్షంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత తెలంగాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హరీష్ పిలుపునిచ్చారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ఒక్కో మొక్కను నాటాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పిలుపునివ్వడం తెలిసిందే.

ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్నినిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. అడవుల సంరక్షణ, పునరుద్దరణపై ప్రజల్లోనూ విసృత అవగాహన కల్పించే దిశగా అటవీ శాఖ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి సూచించారు. సీఎం ఆశయానికి అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పని చేయాలన్నారు.