ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంకస్దాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్కులో 90 ఎకరాల్లో రూ.250 కోట్ల రూపాయలతో సహాజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్ధ స్టెంట్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించనుంది.
గుండె ఆపరేషన్ కు వినియోగించ్ స్టెంట్ తయారుచేసే కంపెనీ తెలంగాణలో ఏర్పాటు కావటం గర్వకారణమని మంత్రి ఈటెల అన్నారు. అతి తక్కువ ధరకు వైద్య పరికరాలు అందించేలా పరిశోధన చేయాలని ఈసందర్భంగా మంత్రి అన్నారు. అవసరమైతే స్ధానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని మంత్రి ఈటెల సూచించారు.
స్టెంట్లు ఇక్కడే తయారు చేస్తున్నందున యాజమాన్యం తెలంగాణ వాసులకు తక్కువ ధరకే స్టెంట్లు సప్లయ్ చేయాలని సభలో పాల్గోన్న కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి కోరారు. మెడికల్ డివైజ్ పార్క్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామిక వేత్తలు పోటీ పడుతున్నారని,మరో 300 ఎకరాల భూమి సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు.