భయపడకండి : బురద రంగులో కృష్ణా జలాలు

  • Publish Date - August 31, 2019 / 02:34 AM IST

కృష్ణా నీరు రంగు మారింది. బురద రంగులో ఉండడంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో నీటి రంగు మారడంతో ఏమవుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని వెల్లడించారు. కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ నుంచి సరఫరా చేసే నీళ్లు బురద రంగులో కనిపిస్తున్నాయని, జనం భయపడాల్సిన పని లేదని జలమండలి 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇటీవలే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. గేట్లను తెరిచి నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. నీటిలో మట్టి రేణువులు అధిక శాతం ఉన్నాయి..అదే నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. 

రానున్న రోజుల్లో మట్టి శాతం తగ్గి..సాధారణంగా మారుతాయని అధికారులు అంటున్నారు. కానీ..ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నీటిని వేడిచేసి వడబోసి తీసుకొంటే బెటర్ అని సూచిస్తున్నారు.