సెప్టెంబర్తో వర్షాకాలం ముగుస్తున్నా..నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దసరా వరకు వర్షాలు పడుతూనే ఉంటాయని, ఏటా అక్టోబర్ రెండో వారం వరకు వానలు పడుతూనే ఉంటాయన్నారు. ఇంటీరియర్ కర్ణాటక, దాన్ని ఆనుకుని ఉన్న రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఈ ఉపరితల ఆవర్తనం నుంచి జార్ఖండ్ వరకు తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, ఇంటీరియర్ ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు వెల్లడదించారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఒకేసారి రావడంతో క్యుములోనింబస్ మేఘాలు ఉధృతమే అనేకచోట్ల ఒకేసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే..గ్రేటర్లో పెద్దగా వర్షాల్లేవు. సెప్టెంబర్ నెల స్టార్టింగ్ నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో మంగళవారం 24 గంటల వ్యవధిలో తిరుమలగిరిలో 13.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తమైంది. ట్రాఫిక్ భారీగా స్తంభించిపోతోంది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. వర్షాలు ఇంకా పడుతాయనే వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.