తెలంగాణలో యువతికి కరోనా: 19కి చేరిన బాధితుల సంఖ్య

  • Publish Date - March 20, 2020 / 05:22 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా రోజురోజుకు అనుమానితుల సంఖ్యతో పాటు.. బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది.  తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది.

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోక పోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అంటుంది ప్రభుత్వం. ఇటలీలో పరిస్థితులను చూసి అందరూ అర్ధం చేసుకోవాలని ఆరోగ్య మంత్రి ఈటెల కూడా విజ్ఞప్తి చేశారు. బుధవారం( 18 మార్చి 2020) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదవగా నిన్న(19 మార్చి 2020) మూడు కేసులు పాజిటివ్ అని తేలాయి. కాగా ఇవాళ(20 మార్చి 2020) మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలినట్లు వెల్లడించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.

లేటెస్ట్‌గా నిర్ధారణ అయిన మూడు కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకోగా.. లండన్ నుంచి వచ్చిన 18 ఏళ్ల హైదరాబాద్ యువతి కూడా పాజిటివ్ కేసులో ఉంది. ప్రస్తుతం బాధితురాలు చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియా బృందంలో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోనేసియా బాధితుల్లో 27 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టారు ఇప్పటికే విద్యాసంస్థలు, బార్లు, జిమ్‌లు, పార్క్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.