తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు క్యూ కట్టారు. శనివారం (అక్టోబర్ 5, 2019) ఉదయం నుంచి మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని చెప్పారు.
సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించింది. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అర్ధరాత్రి 12.30 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. రెండు మార్గాల్లో మెట్రో రైళ్లను 810 ట్రిప్పులు నడపనున్నారు.
రద్దీగా ఉంటే ప్రతి 3 నిమిషాలకు ఓ రైలును నడపుతామని అధికారులు చెప్పారు. రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టికెట్ కౌంటర్లు, యంత్రాలు ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు. రద్దీ నిర్వహణ కోసం ఎల్బీనగర్, అమీర్పేట్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్ గ్రౌండ్స్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మెట్రో సీనియర్ అధికారులు విధుల్లోకి దిగారు.