హైదరాబాద్: సత్తుపల్లి నియోజక వర్గ అభివృధ్దికోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ది చెందుతోందని , నియోజక వర్గ ప్రజల మనోభావాలకనుగుణంగా అభివృధ్ధిలో భాగస్వాములవటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ హితం కోసం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టీఆర్ఎస్ లో చేరాలనినిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో నిరాడంబరంగా ప్రజలకు సేవ చేయబట్టే నన్ను 3సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృధ్ది కోసం , ఖమ్మంజిల్లా అభివృధ్దికోసం సీఎంకేసీఆర్ చేస్తున్న కృషి కి అనుగుణంగా ఆయనతో కలిసి పనిచేస్తానని సండ్ర తెలిపారు.
ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు శనివారం ప్రకటించారు. “రాష్ట్రంతోపాటు ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో కలిసి పనిచేయాలని, టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని” కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని, అవసరమైతే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున మళ్లీ పోటీచేస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం సంయుక్తంగా ఒక లేఖను కూడా విడుదల చేశారు.