హైదరాబాద్ : ఆరడుగులంటే మనిషి కూడా అర అంగుళం కూడా లేని దోమంటే చాలు హడలిపోతాడు. దోమల సమస్యలను అధిగమించేందుకు జీహెచ్ ఎంసీ టెక్నాలజీని వాడుతు..వినూత్న యత్నాలు చేపట్టింది. చెరువుల పరిసర ప్రాంతాల్లో నివాసంలో దోమలతో సతమతమవుతున్న వారి ఉపశమనం కోసం డ్రోన్స్ సపోర్ట్ తో దోమల బాధను పోగొట్టేందుకు యత్నిస్తోంది.
చెరువుల్లో పేరుకు పోయిన గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించటం సాధ్యంకావటంలేదు.ఒకవైపు నుంచి గుర్రపుడెక్కను తొలగించేలోపు మరోవైపు నుంచి ఏపుగా పెరుగిపోతోంది. ఈ గుర్రపు డెక్క వల్ల దోమల బెడద కూడా పెరుగుతోంది.ఎకరాల విస్తీర్ణయంలో ఉన్న చెరువుల్లో దోమలు అత్యధికంగా ఉంటాయి. దీంతో చెరువు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ప్రజలకు దోమల సమస్య అధికంగా ఉంటోంది. ఈ సమస్య పరిష్కారానికి గుర్రపు డెక్కను నిర్మూలించటం సాధ్యకాకపోవటంతో దోమల్ని చంపేందుకు డోన్ల ద్వారా క్రిమి సంహారక మందులను పిచికారి చేసే ప్రక్రియకు యత్నిస్తోంది జీహెచ్ ఎంసీ. ఈ క్రమంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథ్ చెరువులో ఈ ప్రయత్నాన్ని చేపట్టింది.
డ్రోన్ సహాయంతో పిచికారి…
డ్రోన్ కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీయడం తరచుగా చూస్తున్నాం. ఇటివలి కాలంలో పంట పొలాల్లో క్రిమి సంహారక మందులను పిచికారి చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. పొలాలకు వినియోగించినట్లుగానే గుర్రపుడెక్కలోని దోమలను నిర్మూలించేందుకు డ్రోన్ల సహాయంతో క్రిమి సంహారక మందులను పిచికారి చేసేందుకు జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ కమిషనర్ హరిచందన శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం ఫలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చెరువుల్లోను ఈ కార్యక్రమాలను కొనసాగనుంది. మాన్యువల్ గా సాధ్యం కానీ ఈ పనిని డ్రోన్ల ద్వారా చేయాలని యత్నిస్తోంది. తానోస్ టెక్నాలజీస్ అనే సంస్థ వారు పంటపొలాల్లో డ్రోన్ల సహాయంతో క్రిమి సంహారక మందులను పిచికారి చేసే సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అభ్యర్థన మేరకు చెరువుల్లో క్రిమిసంహారక మందులను పిచికారి చేసేందుకు డ్రోన్లతో ముందుకు వచ్చింది తానోస్. ప్రతిష్టాత్మకంగా మియాపూర్ గుర్నాథ్ చెరువులో గురువారం ట్రయల్స్ నిర్వహించారు.
చెరువుల్లోని గుర్రపుడెక్క వల్ల ఈ సమస్య తీవ్రత పెరుగుతోందనీ..అందుకే గుర్రపుడెక్కలోని దోమలను నియంత్రించాలనే ఉద్ధేశ్యంలో డ్రోన్ల సహాయంతో కెమికల్ లిక్విడ్ తో పిచికారి చేసేందుకు శ్రీకారం చుట్టామని ఈ ప్రయోగం సక్సెస్ అవుతే త్వరలో అన్ని చెరువులకు ఈ సేవలను విస్తరిస్తామని జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ కమిషనర్ హరిచందన తెలిపారు.