2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్..శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతారు. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్కు ఆమోద ముద్ర వేశారు.
హామీల అమలు :
ఎన్నికల సందర్బంగా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను బడ్జెట్లో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అవసరమైన నిధుల వివరాలను పొందుపర్చాలని సూచించారు. పేరుకు తాత్కాలిక బడ్జెట్ అయినా.. పెద్దపద్దులతో పూర్తిస్థాయి వివరాలతో బడ్జెట్కు తుది రూపమిచ్చినట్లు సమాచారం.
పెన్షన్లు.. రైతు బంధు :
ఇప్పటివరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా 5,043 కోట్లు చెల్లిస్తోంది. అయితే.. ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో… ప్రభుత్వంపై మరో 5 కోట్ల భారం పడనుంది. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి 8 వేల రూపాయలు సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి ఆ సాయం ఎకరానికి 10 వేల రూపాయలకు పెంచాలని, అలాగే రైతుబీమాకు 1500 కోట్లు కేటాయించనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 25న బడ్జెట్కు ఆమోదం :
ఆరోగ్యశాఖకు 10 వేల కోట్లు, బీసీలకు 5 వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు, ఎస్సీలకు 16 వేల కోట్లు, ఎస్టీలకు 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం బడ్జెట్పై శాసనసభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం సభకు సెలవు ప్రకటించడంతో.. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం బడ్జెట్కు శాసనసభ ఆమోద ముద్ర వేయనుంది.
Read Also: తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: తెలంగాణ బడ్జెట్ : సీఎం హోదాలో తొలిసారి ప్రవేశపెట్టనున్న కేసీఆర్