TSSPDCL EXAM: తెలంగాణ ఎస్‌పీడీసీఎల్ జూనియర్ లైన్‌మెన్‌ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త పరీక్షా తేదీ ప్రకటన

గత నెలలో జరిగిన టీఎస్ఎస్‌పీడీసీఎల్ లైన్‌మెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ పరీక్ష సందర్భంగా 181 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పరీక్షా తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది.

TSSPDCL EXAM: గత నెలలో నిర్వహించిన తెలంగాణ ఎస్‌పీడీసీఎల్ జూనియర్ లైన్‌మెన్‌ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. వెయ్యి పోస్టులకుగాను, జూలై 17న రాత పరీక్ష నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలో 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు హైదరాబాద్, రాచకొండ పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ పరీక్ష రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది.

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

అయితే మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఏడీఈలతోపాటు, మరో ఐదుగురు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ పరిధి, ఘట్‌కేసర్‌లోని ఒక పరీక్షా కేంద్రంలో ఒక అభ్యర్థి స్మార్ట్‌ఫోన్‌తో దొరికిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే పరీక్ష సందర్భంగా సరైన సమాధానాలు చెప్పేందుకు కొందరు ఉద్యోగులు తన దగ్గర లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని, ఒక అభ్యర్థి అంబర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి బాధ్యులైన ఏడీఈతోపాటు, ఐదుగురు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్టు చేసి విచారించారు.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొత్తం మాల్ ప్రాక్టీస్ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐదుగురు ఉద్యోగుల్ని ఇప్పటికే విధుల్లోంచి తొలగించారు. ఈ నేపథ్యంలో పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పరీక్షా తేదీని వెల్లడిస్తామని సంస్థ సీఎండి రఘుమా రెడ్డి తెలిపారు.