ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. అన్ని డిపోల కార్మికుల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. జేఏసీ నేతల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు చెప్పారని తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని తెలిపారు.
మంగళవారం (నవంబర్ 19, 2019) హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు. సమ్మె కొనసాగింపుపై కార్మికులు తర్జనభర్జన పడ్డారు. సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. లేబర్ కోర్టు తేల్చే వరకు సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయం తీసుకోవాలని జేఏసీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.
సమస్యలు పరిష్కరిస్తామని, సమ్మెను కాల్ ఆఫ్ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వస్తే తాము నిర్ణయం తీసుకుంటామని..అప్పటి వరకు సమ్మె యథావిధిగా నడుస్తుందన్నారు. కార్మికుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ స్పందన లేదన్నారు. శవాలపై సీఎం పరిపాలన నడుస్తోందన్నారు. సమ్మె కొనసాగుతుందో, ఫుల్ స్టాప్ పడుతుందో అన్న విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలన్నారు.
సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు చెప్పారు. ఇది చట్ట వ్యతిరేకమైన సమ్మె కాదన్నారు. సీఎం కేసీఆర్ కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారం చేతిలో తీసుకొని, ఆర్టీసీ ఆస్తులను తీసుకుని నయీం కేసులాగా చేస్తున్నారని చెప్పారు. డిమాండ్ల సాధన కోసం పోరాడుతామని చెబుతున్నారు.