Ayodhya Ram Mandir: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం
- saleem sk
- Published On : June 2, 2023 / 07:01 AM IST
Ayodhya Ram Mandir
అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని అద్భుతమైన రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.(Ayodhya Ram Mandir) అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు(Installation of idol) ప్రధాని మోదీకి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Ram Mandir Trust) ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆహ్వానం పంపించనున్నారు. ఈ శుభకార్యానికి హాజరు కావాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) రామమందిర్ ట్రస్ట్ అధికారిక అభ్యర్థన లేఖను పంపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖలో ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకం ఉంది. ఈ ఏడాది డిసెంబర్, లేదా వచ్చే ఏడాది జనవరి నెలల మధ్య అనుకూలమైన తేదీని ధృవీకరించమని లేఖలో ప్రధానమంత్రిని అభ్యర్థించనున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం ప్రధాని మోదీకి పంపే లేఖ ఆకృతిని ఖరారు చేసింది.
2024వ సంవత్సరంలో రామ మందిరాన్ని తెరవడానికి అయోధ్య నగరం సిద్ధమవుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసింది.అయోధ్య నగరంలో విమానాశ్రయం ఏర్పాటు, రైల్వే స్టేషన్ విస్తరణ పనులు చేపట్టారు.శ్రీరామ జన్మభూమి,హనుమాన్ గర్హి ఆలయానికి భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి పలు రహదారి కారిడార్లలో నిర్మాణ పనులు వేగవంతం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.అయోధ్యలోని మణిరామ్ దాస్ చావ్నీ పీఠ్లో బుధవారం రామమందిరానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు బోర్డులోని 11 మంది ధర్మకర్తలు సమావేశమయ్యారు. మణిరామ్ దాస్ చావ్నీ పీఠ్లో నివాసం ఉంటున్న శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ సభకు అధ్యక్షత వహించారు.
ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అయోధ్య ప్రాణ్-ప్రతిష్ఠ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించనుంది.అయితే వేడుక తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వచ్చే ఏడాది జనవరి నెలలో మకర సంక్రాంతి లేదా ఆ తర్వాత వారం రోజుల వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు ఒక శుభ తేదీని నిర్ణయించడానికి ట్రస్ట్ ప్రఖ్యాత జ్యోతిష్కులను సంప్రదిస్తోంది.
