Pariksha Pe Charcha
‘Pariksha Pe Charcha’ 2023: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్కట్లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయితే, అదే విద్యార్థులు తమ సమయాన్ని, సృజనాత్మకతను మంచి మార్గంలో వాడితే ఉన్న శిఖరాలను అధిగమిస్తారని చెప్పారు. పరీక్షలపై శ్రద్ధ పెట్టే విద్యార్థుల శ్రమ వృథా కాదని చెప్పారు. పరీక్షా పే చర్చ అనేది తనకు కూడా ఓ పరీక్ష వంటిదేనని అన్నారు.
విమర్శకి, అడ్డంకికీ మధ్య చిన్న గీత ఉంటుందని, పిల్లలను సానుకూల దృక్పథం వైపునకు నడిపించేలా తల్లిదండ్రులు విమర్శించాలని చెప్పారు. స్క్రీన్ పై భారత ప్రజలు ప్రతిరోజు సగటున 6 గంటలు గడుపుతారని అన్నారు. ఇది ఆందోళనకర విషయమేనని చెప్పారు. మనం గ్యాడ్జెట్లకు ఎందుకు బానిసలం కావాలని ఆయన ప్రశ్నించారు. ఆ అలవాటును తగ్గించుకోవాలని చెప్పారు. సమయ పాలన గురించి తెలుసుకోవాలంటే అమ్మను చూడాలని ఆయన అన్నారు. అలాగే, విసయాన్ని, ఓటమిని విద్యార్థుల సమానంగా తీసుకోవాలని చెప్పారు.