Amit Shah visits Jammu and Kashmir: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు జమ్మూకశ్మీర్ లో ఆయన పర్యటిస్తారు. ఇవాళ ఉదయం ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా అమిత్ షా… పలు అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు.
ముఖ్యంగా పహారీలకు షెడ్యూల్ తెగ హోదా కల్పించడంపై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో విభేదాలు రావడానికి కారణమైంది. బీజేపీ తీరు సరికాదంటూ పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా మండిపడ్డారు. గతంలో హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు గుజ్జర్లు, పహారీల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
పహారీలకు ఎస్టీ హోదా ఇస్తే బీజేపీకి వారి ఓట్లు పడే అవకాశం ఉంది. రాజౌరీ, పూంచ్, బారాముల్లా, హంద్వారాల్లో పహారీలు భారీ సంఖ్యలో ఉంటారు. వారికి ఎస్టీ హోదా ఇస్తుండడంపై గుజ్జర్లు, బకేర్వాల్లు మండిపడుతున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..