Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక వందే భారత్ రైలు చాలా పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఓ వందే భారత్ రైలులో మాత్రం పెద్ద ఎత్తున చెత్త కనపడడం విస్మయం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోను ఐఏఎస్ అధికారి అవానిష్ శరన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన ఈ అత్యాధునిక రైలులో ప్రయాణికులు తాగి పడేసిన వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగులు, ఆహార పదార్థాలు తీసుకువచ్చిన కంటైనర్లు వంటివి కనపడ్డాయి. దీంతో వాటిని అన్నింటినీ రైల్వే సిబ్బంది శుభ్రం చేస్తుండడం కూడా ఈ ఫొటోలో మనం చూడొచ్చు.
వందే భారత్ రైలును ఇంతగా చెత్తమయం చేసిన ప్రయాణికులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మన దేశ ప్రజలకు వారి బాధ్యతలు ఏంటో తెలియవని కొందరు కామెంట్లు చేశారు. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని కొందరు విమర్శలు గుప్పించారు. భారత్ లో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడానికి గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.
ఈ అత్యాధునిక రైళ్లను మూడేళ్లలో తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఆ ప్రకటన చేసి ఏడాది గడుస్తోంది. పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్ లో రైల్వే శాఖకు రూ.1,40,367 కోట్లు కేటాయించారు.
“We The People.”
Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa
— Awanish Sharan (@AwanishSharan) January 28, 2023