Russian-Ukraine War : స్కూల్ పై రష్యా దాడులు..21 మంది మృతి..మరో 10మంది పరిస్థితి విషమం
స్కూల్ పై రష్యా సేనలు దాడులకు పాల్పడగా 21 మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడివారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
- nagamani
- Published On : March 18, 2022 / 11:56 AM IST
People Killed In Russian Attacks On Ukraine Town Merefa
Russian-Ukraine War : ప్రపంచ దేశాలన్ని వ్యతిరేకిస్తున్నా..రష్యా యుక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తునే ఉంది. దీంట్లో భాగంగా ఓ స్కూల్ పై రష్యా బలగాలు దాడులకు పాల్పడగా ఆ దాడుల్లో 21మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. రష్యా దాడుల్లో 21మంది చనిపోగా మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు అని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
యుక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడిందని..ఖార్కివ్కు సమీపంలోని మెరెఫా పట్టణంలోని స్కూల్, సాంస్కృతిక కేంద్రాన్ని (Cultural center)లక్ష్యంగా చేసుకుని గురువారం (మార్చి17,2022) రష్యా బలగాలు ఫిరంగుల వర్షం కురిపించారని మెరెఫా మేయర్ వెనియామిన్ సిటోవ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 21 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని వెల్లడించారు.
ఖార్కివ్ నగర శివారు ప్రాంతంలో ఉండే మెరెఫా పట్టణం రష్యా బలగాల దాడులతో వణికిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తర్వాత రెండో పెద్ద నగరం ఖార్కివ్ లో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. కూలిపోయిన భవనాలు..నల్లగా మసిబారిపోయి బీతావహాన్ని కలిగిస్తున్నాయి.
