Balochistan: పాకిస్థాన్ సెక్యూరిటీ దళాలకు చెందిన ఏడుగురు తమ అదుపులో ఉన్నారని వేర్పాటువాద సాయుధ సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. పాకిస్థాన్ జైళ్లలో ఉన్న బలూచ్ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఖైదీల మార్పిడి విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి ఏడు రోజుల గడువు విధించింది. ఆ గడువులోగా చర్చలు జరగాలని చెప్పింది. లేదంటే తాము బంధించిన పాక్ దళాలకు మరణశిక్ష విధిస్తామని హెచ్చరించింది.
బీఎల్ఏ సంస్థ మీడియా విభాగం హక్కాల్ విడుదల చేసిన ప్రకటనలో ఈ అల్టిమేటమ్ వెలువడింది. వీడియో సందేశం కూడా విడుదల చేశారు. గడువు ముగియడానికి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపింది.
దీనిపై పాకిస్థాన్ సైన్యం లేదా ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన రాలేదు. బీఎల్ఏ తెలిపిన వివరాల ప్రకారం “ఆపరేషన్ హెరోఫ్” రెండో దశలో పాక్ దళాలకు చెందిన ఏడుగురు పట్టుబడ్డారు.
ఆ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన మొత్తం 17 మందిని వివిధ ప్రాంతాల్లో తమ యోధులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. వారిలో 10 మందిని విడుదల చేశామని తెలిపింది. వారు జాతి పరంగా బలూచ్ ప్రజలు, స్థానిక పోలీసులతో సంబంధం ఉన్నవారిగా గుర్తించిన కారణంగా హెచ్చరికల తర్వాత విడుదల చేశామని పేర్కొంది.
భూభాగ పరిస్థితులు, స్థానిక గుర్తింపు, బలూచ్ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆ 10 మందిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
మిగిలిన ఏడుగురు పాకిస్థాన్ సాధారణ సైన్య యూనిట్ల సభ్యులని బీఎల్ఏ తెలిపింది. వారు ఇప్పటికీ తమ అదుపులో ఉన్నారని పేర్కొంది. బలూచ్ “నేషనల్ కోర్ట్” పేరుతో వ్యవహరించే సంస్థ ముందు విచారణ జరిగిందని తెలిపింది.
ఆ విచారణల్లో పౌరులపై చర్యలు, వారి అదృశ్యాలు, బలూచ్ ప్రజలపై మారణహోమంలో పాల్గొనడం వంటి ఆరోపణలు మోపినట్టు గ్రూప్ పేర్కొంది.
“యుద్ధ పరిస్థితుల్లో కూడా నియమాలు, పరస్పర బాధ్యతలు ఉంటాయని బలూచ్ లిబరేషన్ ఆర్మీ నమ్ముతుంది. ఇప్పుడు తమ సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందా, లేక మౌనం, నిర్లక్ష్యం కొనసాగిస్తూ వారిని ఇలాగే వదిలేసి చంపుకుంటుందా? అన్నది వారి ఇష్టం” అని బీఎల్ఏ ప్రకటించింది.