Suicide Bomb Attack In Pakistan :  పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి .. 83 మంది మృతి, 157మందికి తీవ్ర గాయాలు

పాకిస్థాన్‌లోని పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసు అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. 157మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Published On : January 31, 2023 / 12:39 PM IST

Suicide Bomb Attack At Mosque In Pakistan

Suicide Bomb Attack At Mosque In Pakistan : పాకిస్థాన్‌లోని పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసు అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. 157మంది తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో సోమవారం (జనవరి 30,2023) మధ్యాహ్నాం 1.40 గంటల సమయంలో ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 83మంది ప్రాణాలు కోల్పోగా మరో 157 మంది గాయపడ్డారని పెషావర్ పోలీసు చీఫ్ మహ్మద్ర ఐజాజ్ ఖాన్ తెలిపారు. ఈ దాడి ఉగ్ర ముఠా తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సీఎం మహ్మద్ ఆజం ఖాన్ సంతాపం ప్రకటించారు.

ఆ దాడి ఘటనలో మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, సైనిక సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. కనీసం అయిదుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, మసీదుకు చెందిన మత గురువు మౌలానా షహీబ్‌జాదా నూరుల్‌ అమీన్‌ మరణించారు. ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకోవటంతో ఆ ప్రాంతమంతా శవాల గుట్టులగా మారిపోయింది. రక్తసిక్తంగా మారిపోయింది. క్షతగాత్రులను లేడీ రీడింగ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా 83 మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు మసీదులో చాలా భాగం వరకు కూలిపోయింది. పేలుడు సమయంలో మసీదు వద్ద సుమారు 400 మంది పోలీసులు ఉండగా మానవ బాంబుగా మారిన వ్యక్తి నాలుగంచెల భద్రతను దాటుకొని మసీదులోకి ప్రవేశించి మరీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

కాగా..అఫ్ఘానిస్థాన్ లో 2022 ఆగస్టులో తమ కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు టీటీపీ ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. దీంట్లో భాగంగానే తమ కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రకటించింది. పాకిస్థాన్ లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో తీవ్రంగా ఖండించారు.