Tauktae cyclone : ‘తౌటే’ అంటే అర్థం ఏమిటో తెలుసా..?
‘తౌటే’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు పెడతారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు రాష్ట్రాలను అతలాకుతం చేస్తున్న తుఫానుకు వాతావరణ శాఖ ‘తౌటే’అని పేరు పెట్టారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘తౌటే’ నామకరణం చేసింది మయన్మార్.
- nagamani
- Published On : May 16, 2021 / 10:29 AM IST
Cyclone Tauktae Named (1)
Tauktae cyclone Barma Lizard Named : ‘తౌటే’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు పెడతారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు రాష్ట్రాలను అతలాకుతం చేస్తున్న తుఫానుకు వాతావరణ శాఖ ‘తౌటే’అని పేరు పెట్టారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘తౌటే’ నామకరణం చేసింది మయన్మార్. అసలు ఈ ‘తౌటే’ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ‘తౌటే’ (Tauktae) అంటే బర్మా భాషలో గోల చేసే బల్లి అని అర్థం అట.
ప్రస్తుతం కేరళ తీరానికి సమీపంలో ఉన్న ‘తౌటే’ ఈ నెల 18న గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఈ తుపానుకు పేరుపెట్టే అవకాశం ఈసారి మయన్మార్ కు లభించింది. మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును తుఫానుకు పెట్టింది. బర్మా భాషలో ‘తౌతే’ అంటే ‘అధికంగా ధ్వనులు చేసే బల్లి’ అని అర్థం.
ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుపానులకు నామకరణం చేసే అవకాశం ఆయా దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది. ఈ నామకరణ కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (డబ్ల్యూఎంఓ/ఈఎస్ సీఏపీ), పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (పీటీసీ) సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏనీ, యెమెన్ దేశాలున్నాయి. 2004 నుంచి ఈ ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేసే విధానం అమలు చేస్తున్నారు.
కాగా ఈ తౌటే ప్రభావంతో కేరళ అల్లకల్లోలంగా ఉంది. తౌటే తుపాన్ ప్రభావం ఎక్కువగా కేరళ రాష్ట్రంపై కనిపిస్తూ..ఇడుక్కి, పాలక్కాడ్, మల్లాపురం, త్రిశూర్, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసరఘడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్డీఆరఎఫ్, సహాయక బృందాలు మోహరించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. త్రిశూర్లో చాలా గ్రామాలు నీట మునిగాయి.
తుపాన్పై ప్రధాని మోడీ అత్యవసర సమీక్షను నిర్వహించారు. ఎన్డీఎంఏ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుకు ఎఫెక్ట్ ఉందని అధికారులు తెలిపారు.
