Anurag Kashyap Shares Afghan Filmmaker Sahraa Karimis Open Letter
Afghan Filmmaker Sahraa Karimis Open Letter : అఫ్గనిస్తాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. 20 ఏళ్ల నిరీక్షణ తరువాత దేశాన్ని తమ వశం చేసుకున్న తాలిబన్లు అరాచకాలకు నాంది పలికారు. యువతులు, మహిళలు తమ భవిష్యత్తు మాట ఎటున్నా..ప్రస్తుతం తమ జీవితాలు ఎలా ఉండబోతాయోనని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాలిబన్ల అఘాయిత్యాలు..అత్యాచారాలకు ఎక్కడ బలైపోతామోనని అనుక్షణం భయం గుప్పిట్లో క్షణమొక యుగంలో బతుకుతున్నారు. చిన్నపిల్లను కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేస్తు్న్నారు. ఇళ్లు లూటీ చేస్తున్నారు. అడ్డు వస్తే కర్కశంగా కాల్చిపారేస్తున్నారు. ఆఫ్గాన్ లో ప్రజల పరిస్థితిపై ప్రపంచం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తోంది.
తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవటం..అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు అష్టకష్టలు పడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. చూస్తుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈ పరిస్థితుల గురించి అఫ్గనిస్తాన్ దర్శకురాలు సహ్ర కరిమి బహిరంగ లేఖను రాసారు.
లేఖలో ఆమె దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండదొద్దని తమ దేశంలో నెలకొన్ని పరిస్థితులను లేఖలో వివరిస్తూ పోస్టు చేశానని దయచేసి ఈ లేఖను షేర్ చేయమని ఆమె కోరారు. ప్రస్తుతం అఫ్గాన్ దేశంలో పరిస్థితులు..ముఖ్యంగా మహిళలు,బాలికలు,యువతుల దుస్థితిని ఆమె లేఖలో పేర్కొన్నారు. లేఖలో ఆమె ఇలా పేర్కొన్నారు…
‘గత కొన్నివారాలుగా తాలిబన్లు అఫ్ఘనిస్తాన్లోని పలు బలగాలను తమ వశం చేసుకున్నారు. చాలామంది ప్రజలను ముఖ్యంగా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి పెద్ద వయసున్న వారికిచ్చి పెళ్లి చేశారు. ఓ కమెడియన్ని ఇంటిని లాక్కొచ్చి అత్యంత దారుణంగా చిత్రహింసలపాలు చేసి చంపేశారు. మరో మహిళ కళ్లు పీకేశారు. కొంతమంది రచయిలు, మీడియా, ప్రభుత్వ పెద్దలను చంపేశారు.
తమ దేశం తాలిబన్ల వశమవడంతో అఫ్గనిస్తాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశ అభ్యుదయం కోసం ఎంతో కష్టపడి సాధించుకున్నవన్నీ ప్రమాదంలో ఉన్నాయి. తాలిబన్లు పాలిస్తే అన్నింటిపైనా నిషేధాలు విధిస్తారు. మహిళల హక్కులను కాలరాస్తారు. భావ వ్యక్తీకరణను అణచివేస్తారు. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు స్కూళ్లలో చదువుకోవటానికి వచ్చే బాలికల సంఖ్య సున్నాగా ఉండేది. కానీ వారి పాలన పోయాక 9 మిలియన్లకు పైగా అఫ్గన్ బాలికలు స్కూల్కు వెళ్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. కానీ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే..బాలికలు స్కూళ్లకు వెళ్లటం ఎలా ఉన్నా..ఇంటినుంచి బయటకు రావటానికే భయపడిపోయే పరిస్థితి.
తాలిబన్ల నుంచి మా ప్రజలను కాపాడటంతో మీరు నాతోచేతులు కలపండి. ముక్కలైపోయిన హృదయంతో నేను ఈ లేఖ రాస్తున్నాను..ఎంతో ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి దీన్ని అందరూ షేర్ చేయండి. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు’ అంటూ ఆమె లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ను బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సహా పలువురు రీట్వీట్లు చేశారు.