Baghdad Bomb Blast : ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈద్ లక్ష్యంగా మిలిటెంట్లు రెచ్చిపోయారు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్లోని ఓ రద్దీ మార్కెట్లో బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఆ ప్రాంతం అంతా రక్తపు ముద్దలతో భయానకంగా మారింది.
సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్ కు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది.