Jesus Christ Burial Cloth: యేసు క్రీస్తు బరియల్ క్లాత్‌పై భారత డీఎన్ఏ ఆనవాళ్లు..! ఏం చెబుతుంది.. తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

ఆ వస్త్రం చుట్టూ సంవత్సరాలుగా కొనసాగుతున్న శాస్త్రీయ వివాదానికి కొనసాగింపుగా ఈ తాజా DNA అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

  • Published On : April 2, 2026 / 08:06 PM IST

 

Jesus Christ Burial Cloth: క్రైస్తవ మతంలో అత్యంత చర్చనీయాంశమైన, నిశితంగా పరిశీలించబడిన అవశేషాలలో ఒకటి ట్యూరిన్ ష్రౌడ్. దీని సుదీర్ఘ వివాదాస్పద చరిత్రలో మరో మలుపు తీసుకుంది. శిలువ వేయడం వల్ల కలిగే గాయాలతో ఉన్న ఒక మనిషి అస్పష్టమైన చిత్రాన్ని కలిగున్న, ఏసుక్రీస్తు బరియల్ క్లాత్ గా (ఖనన వస్త్రం) పరిగణించబడే ఈ 4.4 మీటర్ల పొడవైన నార వస్త్రంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులతో ముడిపడి ఉన్న DNA ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాదు మొక్కలు, జంతువులు, మనుషుల జన్యు పదార్థం కూడా ఉందని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. ఇది శతాబ్దాలుగా భారత, ఐరోపా ప్రాంతాలతో సంబంధాలను కలిగి ఉండొచ్చని సూచిస్తోంది.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుమారు 40శాతం డీఎన్ఏ భారతీయ మూలాలతో సంబంధాలను చూపించింది. దీంతో ఆ నార వస్త్రం సింధు లోయ నుండి వచ్చి ఉండొచ్చని, లేదా ఆ వస్త్రానికి భారత ఉపఖండంతో ఏదో ఒక విధంగా సంబంధం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

బయోఆర్క్సివ్ అనే ప్రీప్రింట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఫలితాలు ఆ పురావస్తువు మూలం, కదలిక, ప్రామాణికతకు సంబంధించిన పాత చర్చను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. బిలీవర్స్ దృష్టిలో శిలువ వేయబడిన తర్వాత యేసు దేహాన్ని చుట్టిన వస్త్రం ఇదేనని చాలామంది నమ్ముతారు. ఆ కఫన్ క్లాత్ ఎప్పటినుంచో ఒక పవిత్ర వస్తువుగా నిలిచింది. చరిత్రకారులకు, శాస్త్రవేత్తలకు మాత్రం ఇది సమాధానం లేని అనేక ప్రశ్నలతో నిండిన ఒక మధ్యయుగపు వస్తువుగానే మిగిలిపోయింది.

ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన గియానీ బార్కాసియాతో సహా పరిశోధకుల నేతృత్వంలోని ఒక బృందం 1978లో బరియల్ క్లాత్ నుండి సేకరించిన జీవసంబంధమైన పదార్థాన్ని పరిశీలించింది. వారి లక్ష్యం విశ్వాస వాదనలను నిరూపించడం కాదు, ఆ నార వస్త్రంపై భద్రపరచబడిన విభిన్న DNA ఆనవాళ్లను అధ్యయనం చేయడమే.

టూరిన్ ష్రౌడ్‌పై కనుగొనబడిన DNA ఆనవాళ్లు, ఆ వస్త్రం మధ్యధరా ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించి ఉండే అవకాశం ఉందని, దానిలోని దారం భారతదేశంలో ఉత్పత్తి చేయబడి ఉండొచ్చనే అవకాశాన్ని సూచిస్తున్నాయని బృందం పేర్కొంది. దీని ఫలితంగా ఒక సంక్లిష్టమైన జీవ రికార్డు వెలుగులోకి వచ్చింది. మానవులు, పెంపుడు జంతువులు, వన్యప్రాణులు, కీటకాలు, మొక్కలతో సహా అనేక మూలాల నుండి DNAను కనుగొన్నారు పరిశోధకులు. మానవ జన్యు పదార్థంలో గణనీయమైన భాగం భారత ఉపఖండంలోని వంశాలతో సంబంధాలను చూపిస్తోందనే వాదన, అత్యంత చర్చనీయాంశమైన విషయాలలో ఒకటిగా నిలిచింది.

కొత్త సిద్ధాంతానికి దారితీసిన పరిశీలన..

ఆ నార వస్త్రానికి, లేదా కనీసం దానిని తయారు చేయడానికి ఉపయోగించిన దారానికి, భారతదేశంతో ఏదో ఒక సంబంధం ఉండి ఉండొచ్చు, లేదా దాని సుదీర్ఘ ప్రయాణంలో ఏదో ఒక దశలో ఆ వస్త్రం ఆ ప్రాంత ప్రజలతో సంబంధంలోకి వచ్చి ఉండొచ్చు. కాలక్రమేణా ఆ శవ వస్త్రం వివిధ వాతావరణాలకు , జనాభాకు గురైనట్లు కనిపిస్తోందని ఈ అధ్యయనం పేర్కొంది.

‘భారతీయ DNA’ వాదన ఎందుకు కీలకం..

అధ్యయనంలో అత్యధికంగా దృష్టిని ఆకర్షించిన భాగం ఇదే. జన్యుపరమైన ఆనవాళ్లను జాగ్రత్తగా విశ్లేషించినప్పటికీ ఆ కఫన్ వస్త్రం భారతదేశంలో తయారైందని దీని అర్థం కాదు. ఒక వస్తువుపై DNA.. స్పర్శ, రవాణ, వాణిజ్యం, ప్రదర్శన, మరమ్మత్తు లేదా కాలుష్యం ద్వారా చేరవచ్చు. పదేపదే వాడి, అధ్యయనం చేసిన ఒక పురావస్తు వస్తువు విషయంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.

ఆ శవ వస్త్రం చుట్టూ సంవత్సరాలుగా కొనసాగుతున్న శాస్త్రీయ వివాదానికి కొనసాగింపుగా ఈ తాజా DNA అధ్యయనం వెలుగులోకి వచ్చింది. 1988లో, ఆ అవశేషంపై అత్యంత విస్తృతంగా ఉదహరించబడిన పరీక్షలలో ఒకటైన రేడియోకార్బన్ డేటింగ్ ఆ నార వస్త్రం క్రీ.శ. 1260 -1390 మధ్య కాలంలో తయారు చేయబడిందని నిర్ధారించింది. ఆ ఫలితం ఆ వస్త్రాన్ని మధ్యయుగ కాలానికి చెందినదిగా నిర్ధారించింది. ఏసుక్రీస్తు కాలానికి చెందినదిగా కాదు.

చాలామంది చరిత్రకారులకు, మొదటి శతాబ్దపు సమాధి వస్త్రంగా ఆ శవ వస్త్రం ప్రామాణికతకు వ్యతిరేకంగా ఇదే బలమైన సాక్ష్యంగా మారింది. అయినప్పటికీ, ఆ అవశేషం మద్దతుదారులు ఆ పరీక్షను చాలాకాలంగా సవాల్ చేస్తూ వస్తున్నారు. కార్బన్ డేటింగ్‌లో ఉపయోగించిన నమూనా అసలు వస్త్రం నుండి కాకుండా, మరమ్మత్తు చేసిన భాగం నుండి వచ్చి ఉండొచ్చని కొందరు వాదించారు. మరికొందరు అగ్ని, పొగ, వస్తువులను తాకడం లేదా పునరుద్ధరణ వలన కలిగిన కాలుష్యం ఫలితాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని అన్నారు. భారతీయ DNA గురించిన ఈ తాజా వాదన, ఆ శవ వస్త్రం కథను రాత్రికి రాత్రే తిరగరాయదు. కానీ ఇది ఇప్పటికే నిండిపోయిన చరిత్రకు మరో కోణాన్ని జోడిస్తుంది. ఈ చరిత్ర ఇప్పుడు కేవలం మధ్యయుగ ఐరోపా, క్రైస్తవ భక్తి వైపు మాత్రమే కాకుండా, బహుశా విస్తృతమైన రాకపోకలు, సంబంధాలు వినిమయాల మార్గాల వైపు కూడా సూచిస్తోంది.

Also Read: పండుగ చేసుకోండి.. పెట్రోల్, డీజిల్ దెబ్బతో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆరోజు నుంచే ఆరంభం..

కాగా.. మిడిల్ ఈస్ట్ డీఎన్ఏ, నార్త్ ఆఫ్రికన్ డీఎన్ఏ అంటే ఈజిప్ట్, యూరప్ రీజియన్స్ కు సంబంధించిన డీఎన్ఏ కూడా క్లాత్ పై కనిపించిందని పరిశోధకులు తెలిపారు. అంటే ఈ క్లాత్ ఒకే చోట కాకుండా చాలా ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఎన్విరాన్ మెంటల్ ఇన్ ఫ్లుయన్స్ కు గురైంది. కాబట్టి యేసు క్రీస్తు బరియల్ క్లాత్ పై ఇండియన్ డీఎన్ఏ కనిపించింది అనే ఒకే ఒక పాయింట్ తీసుకుని.. అందులో ఉన్న వ్యక్తి ఇండియన్ అని నిర్ధారణ చేయడం కానీ, లేదా ఆ వ్యక్తి ఇండియన్ మూలాలకు సంబంధించిన వ్యక్తి అని కన్ క్లూడ్ చేయడం సైంటిఫికిల్ గా కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు.

డీఎన్ఏ అనాలసిస్ వ్యక్తి ఐడెంటిటీని తెలుపలేదు..

నిజానికి బర్కాషియా టీమ్ వాళ్లే స్పష్టంగా ఏం చెప్పారంటే ఈ డీఎన్ఏ అనాలసిస్ అనేది కేవలం క్లాత్ హిస్టరీని మాత్రమే తెలుపుతుంది తప్పు అందులోని వ్యక్తి ఐడెంటిటీని కాదు. ఈ క్లాత్ పై లభ్యమైన మిక్స్డ్ డీఎన్ఏ నుండి ఒరిజినల్ డీఎన్ ఏను వేరు చేయడం సాధ్యం కాదని పరిశోధకులు తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ క్లాత్ కి వాడిన లెనిన్ ఏన్ షియంట్ ఇండస్ వాలీ సివిలైజేషన్ లో తయారు చేసి ఉండొచ్చన్నారు. ఆ టైమ్ లో మన ఇండియా టెక్స్ టైల్ ప్రొడక్షన్ లో ముందు ఉండేది కాబట్టి ఆ క్లాత్ ని తయారు చేసిన కార్మికుల డీఎన్ఏ ఆ క్లాత్ మీద చేరి ఉండొచ్చన్నారు.

క్రైస్తవ విశ్వాసం యేసు బరియల్ క్లాత్ పై ఆధారపడి లేదు..

ఇకపోతే ఈ క్లాత్ నిజంగానే యేసు క్రీస్తు మృతదేహాన్ని చుట్టడానికి వాడిందేనా అంటే దానికి సంబంధించి సైంటిఫికల్ గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. 1988లో ఈ క్లాత్ పై జరిపిన కార్బన్ డేటింగ్ లో ఇది 1300 ఏడీ కాలానికి చెందినదని సూచించారు. మరో స్టడీ ప్రకారం ఈ క్లాత్ ఫస్ట్ సెంచరీ (50 ఏడీ)కి సంబంధించి ఉండొచ్చని సూచించారు. అయితే, ఈ క్లాత్ ఏజ్ ఏదైనా అవ్వొచ్చు. 1300 ఏడీ కావొచ్చు లేదా 50 ఏడీ కావొచ్చు. క్రిస్టియన్ ఫెయిత్ అనేది ఈ ష్రౌడ్ మీద ఆధారపడి లేదు. క్రైస్తవ విశ్వాసం యేసు క్రీస్తు జీవితం, ఆయన చేసిన బోధనలు, ఆయన మరణం, పునరుద్దానం మీదే ఆధారపడి ఉంది. ఈ ష్రౌడ్ అనేది హిస్టారికల్ ఆర్టిఫ్యాక్ట్ గా ఆసక్తికరమైనదే.. కానీ, క్రైస్తవ విశ్వాసానికి ప్రామాణికం కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

యేసు ఇండియన్ అని కానీ, ఇండియన్ మూలాలున్న వ్యక్తి అని కానీ చెప్పడం కరెక్ట్ కాదు..

డీఎన్ఏ అనేది చాలా ఈజీగా ట్రాన్సఫర్ అవుతుంది. కాబట్టి ష్రౌడ్ పై ఇండియన్ డీఎన్ఏ మాత్రమే కనిపించిందని, అందులో ఉన్న వ్యక్తి ఇండియన్ అని కానీ, ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి అని చెప్పడం అనేది పూర్తిగా అవాస్తవం. ఇండియన్ డీఏఎన్ మాత్రమే కాదు వివిధ దేశాల డీఎన్ఏ ఆ వస్త్రంపై లభ్యమైంది అనేది గుర్తుంచుకోవాలి. అంతేకాదు ప్రాచీన కాలంలో విస్తారమైన ట్రేడ్ లింక్ ఇండస్ వ్యాలీకి, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోపియన్ కంట్రీస్ కు ఉంటుంది కాబట్టి.. ఈ వస్త్రం భారత్ లోనూ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకుమించి ఏమీ లేదు అని నిపుణులు తేల్చి చెప్పారు.