చైనా “కరోనా వ్యాక్సిన్”​ రెడీ…ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు

Chinese company seeks permission to launch covid vaccine కరోనా వ్యాక్సిన్​పై చైనాకు చెందిన “సినోఫార్మ్” సంస్థ కీలక ప్రకటన చేసింది. వివిధ దేశాల్లో వ్యాక్సిన్​పై నిర్వహిస్తున్న క్లినికల్​ పరీక్షల్లో సత్ఫలితాలు అందుతున్నాయని వెల్లడించింది. తమ వ్యాక్సిన్​​ను మార్కెట్​లోకి విడుదల చేసేందుకు అనుమతి కావాలని చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.



వివిధ దేశాల్లో జరిపిన వ్యాక్సిన్​ క్లినికల్ ట్రయల్స్​ సమాచారాన్ని సేకరించి, నివేదిక రూపంలో చైనా ప్రభుత్వానికి అందించాం. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే అని సినోఫార్మ్​ సంస్థ ప్రకటించింది.



ప్రస్తుతం వ్యాక్సిన్​ ట్రయల్స్ ​ చివరి దశలో ఉన్నాయని, ప్రభుత్వం టీకాను అనుమతిస్తే మూడో దశ ఫలితాలను జర్నల్స్​లో విడుదల చేస్తామని సంస్థ సభ్యుల్లో ఒకరు తెలిపారు.



చైనాకు చెందిన ఐదు వ్యాక్సిన్​లు ప్రస్తుతం యూఏఈ, బ్రెజిల్, పాకిస్థాన్​, పెరూలో క్లినికల్​ పరీక్షలు జరుపుకుంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి జావో లిజియన్ ఇటీవలే ప్రకటించారు.



ఇక,ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6 కోట్లు దాటింది.14లక్షల మందికిపైగా మరణించారు.



అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో కోటి 29 లక్షలకుపైగా వైరస్​ కేసులు నమోదవగా.. 2 లక్షల 66 వేల మందికిపైగా మరణించారు. రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య 92లక్షలు దాటగా.. లక్షా 35వేల మంది ప్రాణాలు కోల్పోయారు.



వీటితో పాటు దక్షిణ అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బ్రెజిల్‌, మెక్సికో, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. రెండో దఫా విజృంభణతో ఐరోపాలోని కొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.