బొగ్గు గనిలో వరుస ప్రమాదాలలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చైనాలో మరోసారి బొగ్గుగనిలో పైకప్పు కుప్పకూలిపోయింది.
బీజింగ్: బొగ్గు గనిలో వరుస ప్రమాదాలలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చైనాలో మరోసారి బొగ్గుగనిలో పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 21మంది కార్మికులు మృతి చెందారు. షాన్గిజ ప్రావిన్స్లోని లిజాగవు బొగ్గుగనిలో 81 మంది కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మరణించగా 66 మందిని హుటాహుటిన హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. బొగ్గు గని ప్రమాదాలు ఒక్క 2018లోనే అత్యధికంగా జరగగా.. 3,800 మంది వరకు మృత్యువాత పడినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో దక్షిణ చైనాలోని ఓ బొగ్గుగనిలో వరద నీరు ప్రవేశించడంతో 36 మంది గల్లంతయ్యారు. చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని ఓ బొగ్గుగనిలో వరద నీరు ప్రవేశించిన ధాటికి ఆ గనిలో పనిచేసే 36మంది కార్మికులు గల్లంతయ్యారని జిన్హువా వార్తా పత్రిక వెల్లడించింది. గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిని రక్షించేందుకు చైనా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. గువాన్గ్జీ జువాంగ్ ప్రాంతంలోని నాడు బొగ్గుగనిలో సోమవారం సంభవించిన వరదలో మొత్తం 56 మంది కార్మికులు చిక్కుకున్నారు.
వీరిలో ఏడుగురు సురక్షితంగా వారంతటవారే బయటపడగా జనవరి 13 రాత్రి సహాయక చర్యలు ప్రారంభించిన బృందాలు ఇప్పటివరకు 13 మందిని కాపాడగలిగారని ప్రభుత్వ న్యూస్ చానెల్ జిన్హువా వెల్లడించింది. మరో 12 మంది ఆచూకీ కనుగొన్నామని, వారిని రక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సహాయక బృందాలు తెలిపాయి. ఇకపోతే ఈ బొగ్గుగని 2.98 మిలియన్ల ఉత్పత్తిని నమోదు చేసుకుంటుందని చీఫ్ ఇంజనీర్ హుయాంగ్ జావే పేర్కొన్నారు. ప్రతీ ఏడాది చైనాలోని బొగ్గుగనుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.