నేనే గెలిస్తే.. అమెరికాలో వలసదారుందరికీ సిటిజన్షిప్
- Subhan Ali Shaik
- Published On : October 16, 2020 / 10:26 AM IST
తాను గెలిస్తే.. అమెరికాలో ఉంటున్న వలసదారులందరికీ పౌరసత్వం కల్పిస్తానని హామీ ఇచ్చారు డెమోక్రటిక్ అభ్యర్థి Joe Biden. దీంతో వలసల చరిత్ర ఉన్న అగ్ర రాజ్యంలో మరోసారి వలసదారులకు ఇది గుడ్ న్యూస్ అవుతుందా చూడాలి. ప్రస్తుతం అక్కడే ఉంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకి అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే సిటిజన్షిప్ కల్పిస్తారట.
కరోనా సంక్షోభంపై పోరాటం, ఎకానమీ రీకన్స్ట్రక్షన్, వరల్డ్ వైడ్గా అమెరికా నాయకత్వ పునరుద్ధరణతో పాటుగా వలసదారుల సమస్యలు తమ ఎజెండాలో అగ్రభాగాన ఉంటాయని చెప్పారు. వాషింగ్టన్లో బుధవారం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా బిడెన్ మాట్లాడారు.
‘వలస సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను గెలిచి అధికారంలోకి వస్తే ఇమిగ్రేషన్ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్కి పంపిస్తాను. దాంతో 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది’ అని బిడెన్ చెప్పారు. అక్రమ మార్గాల్లో వచ్చిన వారందరూ అమెరికాలో తిష్ట వేశారని, దేశం నుంచి వెంటనే వారందరినీ తరిమేయాలని అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉంటే వలస విధానంలో దానికి విరుద్ధమైన వైఖరిలో బిడెన్ మాట్లాడారు.
ట్రంప్ నాలుగేళ్లుగా తన విధానాల ద్వారా అమెరికాలో వివిధ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని, అమెరికా ప్రజలు అధికారాన్ని ఇస్తే అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాల్సి ఉందని వివరించారు.
