India-China Standoff: మరోసారి భారత్ – చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు.. తేదీ ఫిక్స్.. చైనా మాట వింటుందా?
గత వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసీ)పై చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిన తరుణంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చివరి (18వ) సమావేశం ఏప్రిల్ 23న జరిగింది.
- Harishth Thanniru
- Published On : August 13, 2023 / 10:36 AM IST
India, China Border
India-China : వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణ ప్రక్రియకోసం గత కొన్నేళ్లుగా భారత్ – చైనా కోర్ కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రెండు దేశాల కమాండర్ల స్థాయి అధికారుల మధ్య సమావేశం జరగనుంది. ఇప్పటికే 18సార్లు వీరి మధ్య సమావేశాలు జరగగా.. 19వ సారి చర్చలకు తేదీ ఫిక్స్ అయింది. ఈనెల 14న ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో నెలకున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే దిశగా ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారని ఏఎన్ఐ వెల్లడించింది. ఈ సమావేశంలో భారత్ పక్షాన చుఘల్ – మోల్డో సరిహద్దు పాయింట్ లో చర్చలు జరగనున్నాయి.
India China Troops : భారత్, చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చు-నివేదికలో ఆందోళనకర విషయాలు
ఈ సమావేశంలో లడఖ్ ఆధారిత 14 కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి చెందిన కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. చైనా వైపు దక్షిణ జిన్ జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్కు చెందిన మిలిటరీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తారు. అత్యున్నత స్థాయి సైనిక చర్చల తదుపరి క్రమంలో తూర్పు లడఖ్లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన దెప్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని భారతదేశం పట్టుబడుతుంది.
గత వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసీ)పై చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిన తరుణంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చివరి (18వ) సమావేశం ఏప్రిల్ 23న జరిగింది. ఇదిలాఉంటే 2020లో తూర్పు లద్దాఖ్లో చైనా, భారత్ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాలను మోహరించాయి. చర్చలతో చాలా ప్రాంతాల్లో ఉపసంహరణ ప్రక్రియ ముగిసినా కొన్ని కీలక పాయింట్ల (దెప్పాంగ్, దెమ్చోక్) విషయంలో చైనా సైనిక ఉపసంహరణకు ససేమీరా అంటోంది. ఈ నేఫథ్యంలో ఈ ఉన్నత స్థాయి సైనిక చర్యలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.
