India Pakistan Talks: కాల్పుల విరమణ తర్వాత భారత్, పాకిస్తాన్ చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ చర్చల్లో భారత్ ఏయే అంశాలను ప్రస్తావించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. పాక్ తో దేని గురించి మాట్లాడే అవకాశం ఉందనేది ఉత్కంఠగా మారింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్, పాకిస్తాన్ చర్చలపై యావత్ దేశం, ప్రపంచం ఆసక్తిగా ఉంది.
ఈ క్రమంలో భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది. కేవలం రెండు అంశాలపై మాత్రమే పాక్ తో మాట్లాడతామని స్పష్టం చేసింది. అందులో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింత, మరొకటి ఉగ్రవాదుల అప్పగింత. ఈ రెండు తప్ప పాకిస్తాన్ తో మాట్లాడటానికి మరేమీ లేవని భారత్ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా కూడా చెప్పింది ఇండియా.
”కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) తిరిగి రావడం అనేది ఒక్కటే మిగిలి ఉంది. ఇంకేమీ మాట్లాడటానికి లేదు. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు కశ్మీర్ విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించకూడదని భారత్ స్పష్టం చేసింది. “మేము ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవడం లేదు. మాకు ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు” అని పరోక్షంగా అమెరికాకు తెలియజేసింది భారత్.
Also Read: ‘బుల్లెట్ దిగిపోద్ది..’ పాకిస్థాన్ కు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్..
దీర్ఘకాలంగా నలుగుతున్న కాశ్మీర్ వివాదంపై భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాత్రం .. మధ్యవర్తిత్వ ప్రతిపాదనను స్వాగతించారు. అలా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి, కాల్పులను ఆపడానికి భారత్ పాక్ అంగీకరించాయి. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక వైరాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం ఉద్దేశించబడింది. అయితే, ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ వైపు నుండి నియంత్రణ రేఖ వెంబడి భారీ కాల్పులు, షెల్లింగ్ జరిగినట్లు నివేదించబడింది. పాక్ తీరుపై భారత్ సీరియస్ గా ఉంది.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. అమాయకులను అతి కిరాతకంగా కాల్చి చంపారు. మతం పేరుతో మారణహోమం సృష్టించారు. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఆపరేషన్కు ప్రతి స్పందనగా, పాకిస్తాన్ సైన్యం భారత్ పై దాడికి యత్నించింది. సైనిక స్థావరాలు, నివాసాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగులను ప్రయోగించింది. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చేసింది. పాకిస్తాన్పై తాజా చర్య 40ఏళ్ల ఉగ్రవాదానికి ప్రతిఫలమని భారత్ చెప్పింది.