Indonesia Earthquake : ఇండోనేషియా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. సులవేసి దీవుల్లో వచ్చిన ఈ భారీ భూకంపం రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ రెండుగా నమోదైంది. భూకంపం దాటికి వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి.
ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. సులవేసి దీవిలోని మముజుకి దక్షిణంగా 36 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
రెండు రోజుల్లో 26సార్లు భూ ప్రకంపణలు రావడంతో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2018లోనూ ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం నమోదు కాగా.. వందల మంది ప్రాణాలు పోయాయి.