ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై మిస్సైళ్ల దాడి
- Subhan Ali Shaik
- Published On : October 11, 2019 / 09:39 AM IST
ఇరాన్కు చెందిన నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్పై దాడి జరిగింది. ఎర్ర సముద్రం గుండా పోతున్న ట్యాంకర్ సౌదీ అరేబియాకు దగ్గర్లో ప్రమాదానికి గురైంది. జెద్దా తీరంలో చమురును తీసుకెళ్తున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో 60మైళ్ల దూరం వరకూ ఆలయ్ ఎర్ర సముద్రంలోకి లీకైంది. ఈ ప్రమాదంలో సిబ్బందికి గానీ, మరే ఇతర వ్యక్తులకు ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఈ ఘటనపై సౌదీ అరేబియా నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.
ఇప్పటికే ఇరాన్ సౌదీ అరేబియా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో సౌదీ అరేబియాలోని రెండు చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ మద్దతున్న హుతీ తిరుగుబాటుదారులు దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో సౌదీ తీరంలో ఇరాన్ ట్యాంకర్ పై దాడి జరగడం గమనార్హం.
