Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Harish Thanniru
- Published on- July 5, 2026 / 09:52 AM IST
Telangana Rains
- తెలంగాణకు రెయిన్ అలర్ట్..
- నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Telangana Rains : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణం చల్లబడటంతోపాటు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే, తాజాగా. వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే వారం రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : Telangana Scheme : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ అదిరిపోయే శుభవార్త.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన బలమైన అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ (ఆదివారం) ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరుగా వానలు పడుతాయని తెలిపింది.
ఇదిలాఉంటే.. శనివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లిలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఇదే జిల్లా సిర్పూర్ (టి), వాంకిడిలో 3.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాప్రాల 3.5, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే, ఆదివారంతోపాటు రానున్న వారం రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని, చెట్లు కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
