Morning Consult Survey: ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా గతంలో నిర్వహంచిన పలు సర్వేల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్లో ఇదే విషయం వెల్లడైంది. వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్గా ప్రధానమంత్రి మోదీ మరోసారి ఎంపికయ్యారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీ నాయకత్వానికి 75శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
ఇక రెండవ స్థానంలో స్విట్జర్లాండ్ అధినేత అలైన్ బెర్సెట్ నిలిచారు. ఆయనకు 60 శాతం మంది అనుకూలంగా ఓట్లు వేశారు. 59 శాతం మద్దతుతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యూయోల్ లోపెజ్ ఒబ్రాడెర్కు మూడవ స్థానం లభించింది. ఇకపోతే అగ్రరాజ్యమైన అమెరికా అధినేత జో బైడెన్ 8వ స్థానంలో నిలిచారు. ఈయనకు అనుకూలంగా 40 శాతం ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 52 శాతం ఓట్లు వేయడం గమనార్హం. అలాగే 13వ స్థానం దక్కించికున్న బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ పరిస్థితి ఇలాగే ఉంది. ఆయనకు అనుకూలంగా 31 శాతం ఓట్లు వేయగా వ్యతిరేకంగా 58 శాతం ఓట్లు వచ్చాయి.
ప్రపంచంలోని మొత్తం 22 మంది నాయకుల (ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, నార్వే, పొలాండ్, స్పెయిన్, దక్షిణ కొరియా, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా) ప్రజాదరణ విషయమై ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వరకు ఆ సంస్థ ప్రజాభిప్రాయాలు సేకరించింది. స్వదేశంలోను, ఇతర దేశాల్లోనూ అభిప్రాయాలు తెలుసుకొని రేటింగ్ ఇచ్చింది.